శీతల పానీయాలతో జాగ్రత్త! | - | Sakshi
Sakshi News home page

శీతల పానీయాలతో జాగ్రత్త!

May 2 2025 1:34 AM | Updated on May 2 2025 1:34 AM

శీతల

శీతల పానీయాలతో జాగ్రత్త!

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): ఉమ్మడి జిల్లాలో గత కొన్ని రోజులుగా 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో ప్రజలు దాహం తీర్చుకునేందుకు తహతహ లాడుతున్నారు. ఎండ తీవ్రత నేపథ్యంలో చల్లదనం కోసం ప్రజలు ఎక్కువగా కూల్‌డ్రింక్స్‌ వైపు మొగ్గుచూపుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా కూల్‌డ్రింక్స్‌ దుకాణాలు కళకళలాడుతున్నాయి. అయితే రుచితో పాటు ఆరోగ్యమూ ప్రధానమని కూల్‌డ్రింక్స్‌ కంటే సంప్రదాయ ద్రవాలే మేలని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్క ఏలూరు నగరంలోనే వివిధ కంపెనీల కూల్‌డ్రింక్స్‌ వ్యాపారం రోజుకు సుమారు 60 నుంచి 70 వేల బాటిల్స్‌ అమ్మకాలు జరుగుతున్నాయని, వాటి ద్వారా సుమారు రూ.20 లక్షల వరకూ వ్యాపారం జరుగుతోందని అంచనా.

కూల్‌డ్రింక్స్‌తో అనారోగ్యం

ప్రస్తుతం అన్ని దుకాణాల్లో శీతల పానీయాలు లభిస్తున్నాయి. ఫుట్‌పాత్‌పై వెలసిన దుకాణాల నుంచి కిరాణా దుకాణాలు, రెస్టారెంట్లు, కూల్‌డ్రింక్‌ షాపులు, ప్రత్యేకంగా వెలసిన ఫ్రూట్‌జ్యూస్‌ దుకాణాల్లో సైతం కూల్‌డ్రింక్స్‌ లభిస్తున్నాయి. రెడీమేడ్‌గా తయారు చేసిన ద్రవంతో అప్పటికప్పుడు కొన్ని రకాల కూల్‌డ్రింక్స్‌ తయారు చేసి అందిస్తున్నారు. ఇటీవలి కాలంలో మాక్‌ టైల్స్‌ పేరుతో వివిధ రంగుల్లో ద్రావకాలను కలిపి ఇస్తున్నారు. వీటితోపాటు కొన్ని చెరకు, బత్తాయి రసాలు, మజ్జిగ దుకాణాల్లో అపరిశుభ్రమైన నీటితో తయారైన ఐస్‌ ముక్కలను వాడుతున్నారు. ప్రతి దుకాణంలో రోజుకు రూ.5 వేల నుంచి రూ.20 వేల వరకు వ్యాపారం సాగుతోంది. ఇలాంటి పానీయాలు ఆరోగ్యానికి హానికరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

రంగులు, రసాయనాలతో పలు జబ్బులు

శీతల పానీయాల్లో వాడే కార్బన్‌ డై ఆకై ్సడ్‌, ఫాస్పరస్‌ ఆమ్లాలు శరీరంలోకి చేరి కణాల్లోని ఆక్సిజన్‌ నిల్వలను తగ్గించి కేన్సర్‌కు దారి తీస్తాయని చెబుతున్నారు. దీనితో పాటు సోడియం బెంజోయేట్‌ అనే ప్రిజర్వేటివ్‌ రసాయనం శరీరంలో కణాల్లోని డీఎన్‌ఏపై ప్రభావం చూపుతాయంటున్నారు. వాటిలోని అదనపు కేలరీలు ఊబకాయానికి దారి తీస్తాయని, పానీయంలో ఉండే ఫ్రక్టోజ్‌ వల్ల రక్తపోటు పెరుగుతుందని వివరిస్తున్నారు. వాటిని అధికంగా సేవిస్తే దంతాల పై పొర దెబ్బతింటుందని, కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉందని, దీర్ఘకాలంగా శీతల పానీయాలు తాగితే మెటబాలిక్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధి వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

సంప్రదాయ పానీయాలే మేలు

రసాయనాలు, నిషేధిత రంగులు, అపరిశుభ్రమైన ఐస్‌ ముక్కలను కలిపిన కూల్‌డ్రింక్స్‌ తాగడం కంటే సహజసిద్ధమైన సంప్రదాయ పానీయాలను తాగడం ఆరోగ్యకరమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మనం ఇంట్లో తయారు చేసుకునే మజ్జిగ, లస్సీ, నిమ్మరసం, తాజా పండ్ల జ్యూస్‌లు, కొబ్బరి నీళ్లు, రాగిమాల్ట్‌, నన్నారి షర్బత్‌ మొదలైనవి శరీరానికి చల్లదనాన్ని ఇవ్వడమే గాక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని చెబుతున్నారు.

కూల్‌డ్రింక్స్‌తో అనారోగ్యం తప్పదంటున్న నిపుణులు

సంప్రదాయ పానీయాలే మేలని సూచన

కూల్‌డ్రింక్స్‌ హాని చేస్తాయి

చాలా మంది వేసవి వచ్చిందంటే కూల్‌డ్రింక్స్‌ తాగేందుకే మక్కువ చూపుతారు. వాస్తవంగా అందులో పొటాషియం ఉన్న ఉప్పు ఉంటుంది. ఇది శరీరానికి హాని చేస్తుంది. దానికి బదులు మజ్జిగ, నిమ్మకాయ సోడాలో ఉప్పు వేసుకుని తాగాలి. మనం వేసుకొని తాగే ఉప్పులో సోడియం ఉంటుంది. దీంతో పాటు కూరల్లోనూ ఉప్పును వాడాలి. ప్రతిఒక్కరూ రోజుకు నాలుగు లీటర్ల మంచినీటిని తాగాలి. ఎండవేడిమి కారణంగా మూత్రం పచ్చగా వస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశం ఉంది. మాంసాహారం మితంగా తీసుకోవాలి. నిమ్మజాతి పండ్లను బాగా తినాలి.

– డాక్టర్‌ ఎంఎల్‌వీ ప్రసాద్‌, ఆంధ్రా హాస్పిటల్స్‌ డైరెక్టర్‌

శీతల పానీయాలతో జాగ్రత్త! 1
1/1

శీతల పానీయాలతో జాగ్రత్త!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement