
నేటి నుంచి గుబ్బల మంగమ్మ జాతర
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కామవరం అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి జాతర మహోత్సవాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజులపాటు జరిగే ఈ జాతర మహోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆలయ కమిటీ పూర్తి చేసింది. అమ్మవారికి ముఖ్యమైన రోజుగా చెప్పుకునే శుక్రవారంతో పాటు మూడో రోజు ఆదివారం రావడంతో లక్షలాది మంది భక్తులు జాతర పాల్గొనే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ జాతర మహోత్సవాల్లో పూర్తిగా గిరిజన సాంప్రదాయ పద్ధతిలోనే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. అలాగే ఈ ఉత్సవాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని ఎస్సై దుర్గామహేశ్వరరావు చెప్పారు.
రెడ్డి గణపవరంలో దుర్గమ్మతల్లి ఉత్సవాలు
మండలంలోని రెడ్డిగణపవరంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ అమ్మవారి ఉత్సవాలు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. ఐదురోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు సంబంధించి ఆలయ కమిటీ ఏర్పాట్లు పూర్తి చేసింది. కనకదుర్గమ్మ జాతర నేపథ్యంలో బుట్టాయగూడెం నుంచి జీలుగుమిల్లి వెళ్లే భారీ వాహనాలు జంగారెడ్డిగూడెం మీదుగా, జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం వచ్చే వాహనాలను జంగారెడ్డిగూడెం మీదుగా దారి మళ్లించినట్లు ఎస్సై తెలిపారు.