
పర్యాటక దినోత్సవాల్లో మాట్లాడుతున్న డీఆర్వో
సాక్షి, భీమవరం: మానవ వికాసానికి, విజ్ఞానానికి, వినోదానికి పర్యటనలు, పర్యాటక ప్రాంతాలు దోహదపడతాయని, భాషలు, సంస్కృతి, సంప్రదాయాలు తెలుస్తాయని జిల్లా రెవెన్యూ అధికారి కె.కృష్ణవేణి అన్నారు. బుధవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భీమవరం డీఎన్నార్ కళాశాలలో నిర్వహించిన వేడుకల్లో ఆమె మాట్లాడారు. జిల్లాలో పలు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయని, పేరుపాలెం బీచ్, కొల్లేరు సరస్సు, టెంపుల్ టూరిజం వంటివి ముఖ్యమైనవన్నారు. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని, పర్యాటక రంగంలో అవకాశాల్ని విద్యార్థులు ఉపయోగించుకోవాలన్నారు. భీమవరం ఆర్డీఓ దాసి రాజు మాట్లాడుతూ పర్యాటక రంగం మానవాళి జీవన విధానాన్ని ప్రభావితం చేయడంతో పాటు రాష్ట్ర, దేశ జీడీపీని పెంచడంతో ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. జిల్లాలో పర్యాటక అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, సీఎం జగన్ ప్రత్యేక చొరవ చూపుతున్నారన్నారు. జిల్లా పర్యాటక శాఖ అధికారి ఎండీహెచ్ మెహరాజ్ మాట్లాడుతూ జిల్లాలో పర్యాటకులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. విద్యార్థుల్లో టూరిజంపై అవగాహన పెంచేందుకు ప్రభుత్వ పాఠశాలల్లో యూత్ క్లబ్బులు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అనంతరం పర్యాటక రంగంపై నిర్వహించిన వ్యాసరచన, పెయింటింగ్, క్విజ్ పోటీల్లో విజేతలకు షీల్డ్స్, సర్టిఫికెట్లు అందజేశారు. ముందుగా పట్టణంలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. కళాశాల ఉపాధ్యక్షుడు గోకరాజు పాండురంగరాజు, ప్రిన్సిపాల్ బీఎస్ శాంతకుమారి, ఎన్ఎస్ఎస్ అధికారి అనిల్ దేవ్, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారి ప్రవీణ్ కృష్ణ, సెట్వెల్ సూపరింటెండెంట్ జాన్ కెన్నెడీ, టూరిజం ఇన్ఫర్మేషన్ అధికారి ఎ.మురళీకృష్ణ పాల్గొన్నారు.
డీఆర్వో కృష్ణవేణి