
మాట్లాడుతున్న ఎస్వీ యూనివర్సిటీ పరిశోధనా సంచాలకులు కె.సర్జన్రెడ్డి
తాడేపల్లిగూడెం: సరోగసీతో గేదె దూడలను పుట్టించే ప్రక్రియను వెంకట్రామన్నగూడెంలోని గేదెల పరిశోధనా స్థానంలో ప్రారంభిస్తామని శ్రీవెంకటేశ్వర యూనివర్సిటీ పశుసంవర్దక విశ్వవిద్యాలయ పరిశోధనా సంచాలకులు డాక్టర్ కె.సర్జన్రెడ్డి వెల్లడించారు. వెంకట్రామన్నగూడెంలోని గేదెల పరిశోధనా స్థానంలో ‘పశువైద్యవృత్తిలో నైపుణ్యాల మెరుగుదల’ అనే అంశంపై బుధవారం ప్రారంభమైన శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. పశువైద్యంలో గ్రామీణ యువతపాత్ర చాలా అవసరమన్నారు. తద్వారా పశుసంపద పెంచవచ్చన్నారు. రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి వ్యవసాయం, పశుపోషణ, మత్స్య పరిశ్రమలపై ఆధారపడి ఉందన్నారు. జగనన్న పాలవెల్లువ ద్వారా పాడిరైతులను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటోందన్నారు. గ్రామీణ యువతకు పశువైద్యం అందించేందుకు నిరంతర శిక్షణా కార్యక్రమాలు కొనసాగిస్తుందన్నారు. గుంటూరు శాస్త్రవేత్తల సాంకేతిక సహకారంతో వెంకట్రామన్నగూడెంలో పిండమార్పిడి ద్వారా దూడల జననం ప్రక్రియను సరోగసీ ద్వారా చేపడతామన్నారు. తర్వాత ప్రక్రియను గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తామన్నారు. గేదెల పరిశోధనా స్థానంలో పశుగ్రాసాల అభివృద్ధి జరుగుతుందన్నారు. 18 నుంచి 20 శాతం మాంసకృత్తులను ఇచ్చే పశుగ్రాసాల అభివృద్ధి చేసి రైతులకు అందుబాటులోకి తెస్తామన్నారు. శిక్షణా కార్యక్రమాలను యువత సద్వినియోగం చేసుకుని స్వయంసమృద్ధిని సాధించాలన్నారు. గేదెల పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె.ఆనందరావు, శాస్త్రవేత్తలు డాక్టర్ రవికుమార్, డాక్టర్ ఎ.తేజా పాల్గొన్నారు.
ఎస్వీ యూనివర్సిటీ పరిశోధనా సంచాలకులు కె.సర్జన్ రెడ్డి