
మోదుగుగుంటలో పీఆర్.126 రకం వరి చేను యంత్రాలతో మాసూలు చేస్తున్న దృశ్యం
●
చేను వద్దే మిల్లర్లు కొంటున్నారు
తక్కువ కాల వ్యవధి కలిగిన పంట కావడంతో ప్రస్తుతం కోతలు ముమ్మరంగా జరుగుతున్నాయి. మిల్లర్లు ఈ రకం వరి ధాన్యాన్ని చేల వద్దే కొనుగోలు చేసి, మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో వాతావరణం మారకుండానే చేతికందిన పంట సిరులుగా మారుతోంది. ఎటువంటి ఇబ్బంది లేదు.
– చలంశెట్టి శివ వెంకటేశ్వరరావు, ఎల్.అగ్రహారం, తాడేపల్లిగూడెం మండలం
ధర కూడా బాగుంది
ఈ ఏడాది వర్షాలు అంతక కురవకపోవడం మెట్ట రైతాంగానికి మేలు చేసింది. దీనికి తోడు పీఆర్–126 రకం వరి వంగడం సాగు చేయడం వల్ల తెగుళ్ల బెడద లేదు. పురుగుల మందుల పిచికారీ ఖర్చులు తగ్గాయి. దిగుబడులు ఆశాజనకంగా ఉన్నాయి. 75 కిలోల బస్తాకు రూ.1370 చొప్పున ధర లభించింది.
– తానింకి సత్యనారాయణ, కౌలు రైతు, మోదుగగుంట, తాడేపల్లిగూడెం మండలం
తాడేపల్లిగూడెం రూరల్ : ఖరీఫ్ సీజన్లో పీఆర్–126 రకం వరి వంగడాన్ని సాగు చేసిన రైతుల మోములో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. దిగుబడులతో పాటు ధర కూడా బాగుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తాడేపల్లిగూడెం మండలంలో దాదాపు 24,012 ఎకరాల విస్తీర్ణంలో ఖరీఫ్ సాగు చేపట్టగా, దాదాపు ఏడు వేల ఎకరాల్లో ప్రధానంగా పీఆర్–126 రకం వరి వంగడాన్ని రైతులు సాగు చేశారు. సాధారణ రకాలతో పోల్చుకుంటే 115 నుంచి 120 రోజుల కాల వ్యవధిలో ఈ పంట చేతికొచ్చింది. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోవడంతో పాటు తెగుళ్లు బారి నుంచి గట్టెక్కే స్వభావం ఉంది. దీనికి తోడు ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వర్షాలు సైతం అంతగా కురవకపోవడం కూడా మెట్ట రైతాంగానికి కలిసొచ్చిన అంశంగా మారింది. ప్రస్తుతం ఈ రకం వరి మాసూళ్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఒక పక్క వాతావరణ శాఖ వర్షాలు పడతాయని హెచ్చరిస్తోంది. దీనికి భిన్నంగా గత రెండు రోజులుగా తాడేపల్లిగూడెం మండలంలో వాతావరణం కూడా అనుకూలించడంతో రైతులు యంత్రాలతో కోతలు ప్రారంభించారు. మెట్ట ప్రాంత గ్రామాల్లో దాదాపు వరి కోతలు సైతం పూర్తి కావచ్చాయి.
అనుకూలించిన వాతావరణం
ఏటా ఖరీఫ్ సీజన్లో వర్షాల కారణంగా మెట్ట ప్రాంతంలో వరి చేలలోకి నీరు చేరడం, పంట చేతికొచ్చే సమయంలో వర్షాలు కురవడం, తల బరువెక్కి కంకులు నేలకొరగడం వంటి కారణాలతో దిగుబడులు తగ్గేవి. దీంతో 40 బస్తాల దిగుబడి రావడమే గననంగా ఉండేది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పీఆర్–126 రకం వరి వంగడం 45 నుంచి 50 బస్తాల దిగుబడి రావడం విశేషం. పచ్చిపైనే మిల్లర్లు 75 కిలోల బస్తాను రూ.1370కు కొనుగోలు చేస్తున్నారు. కోతలు ప్రారంభమైన తొలినాళ్లలో రూ.1390కు సైతం కొనుగోలు చేసినట్లు రైతులు చెబుతున్నారు. అదే గత సీజన్లో రూ.1180కు విక్రయించారు. దాదాపు గత ఏడాది ఖరీఫ్ సీజన్తో పోల్చుకుంటే ధరలో రూ.190 వరకు వ్యత్యాసం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రైతుల మోములో ఆనందం వెల్లివిరుస్తోంది.
రైతులకు సిరులు కురిపిస్తున్న వరి వంగడం
ఎకరానికి 45 నుంచి 50 బస్తాల దిగుబడి
రూ.1370 పలుకుతున్న 75 కిలోల బస్తా
గత సీజన్ కంటే పెరిగిన ధర, దిగుబడి
జిల్లాలో ముమ్మరంగా ఖరీఫ్ వరి కోతలు
సాగు విస్తీర్ణం పెరుగుతోంది
మెట్ట ప్రాంతంలో ఖరీఫ్ వరి సీజన్లో పీఆర్ – 126 వరి వంగడాన్ని సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. ఏటా ఈ వరి వంగడాన్ని సాగు చేసే రైతుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది వర్షాలు తక్కువగా ఉండటం, తెగుళ్లు సమస్య లేకపోవడంతో పాటు దిగుబడులు కూడా పెరిగాయి.
– ఆర్ఎస్ ప్రసాద్, మండల వ్యవసాయాధికారి, తాడేపల్లిగూడెం

ధాన్యం బస్తాలను లారీలోకి ఎక్కిస్తున్న దృశ్యం


