
ముద్దాపురం పాఠశాల ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం తలభాగం తొలగించిన దృశ్యం
తణుకు టౌన్: తణుకు రూరల్ మండలం ముద్దాపురం గ్రామంలోని పాఠశాల ఆవరణలోని అంబేడ్కర్ విగ్రహం తల భాగాన్ని మంగళవారం తెల్లవారు జామున దుండగులు తొలగించారు. సోషల్ మీడియా ద్వారా విషయం తెలుసుకున్న దళిత సంఘాల నాయకులు, అంబేడ్కర్ అభిమానులు, గ్రామ పెద్దలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తెల్లవారే సరికి పాఠశాలకు చేరుకున్నారు. దీంతో గ్రామంలో ఆందోళన వాతావరణం ఏర్పడింది.
క్యూస్ టీం, డాగ్ స్క్వాడ్ల రంగ ప్రవేశం
నిందితులను గుర్తించేందుకు క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్లు రంగ ప్రవేశం చేశాయి. అంబేడ్కర్ విగ్రహం, పక్కనే ఉన్న సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహాలపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. డాగ్ స్క్వాడ్లు అంబేడ్కర్ విగ్రహం నుంచి పక్కనే ఉన్న చెరువు చుట్టూ తిరిగి మళ్లీ పాఠశాల వద్దకే పోలీస్ జాగిలం వచ్చింది.
నిందితులను శిక్షిస్తాం
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ యు.రవిప్రకాష్ మంగళవారం మధ్యాహ్నం సందర్శించారు. నిందితులు ఎంతటి వారైనా పట్టుకుంటామని, చట్ట ప్రకారం కఠినంగా శిక్షిస్తామని ఎస్పీ చెప్పారు. నరసాపురం డీఎస్పీ రవి మనోహరాచారి ఆధ్వర్యంలో తణుకు సీఐలు సీహెచ్ ఆంజనేయులు, ముత్యాల సత్యనారాయణ, ఎస్సైలు తదితరులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. గ్రామంలోని ఐదుగురు అనుమానితులను గుర్తించామని, పూర్తి వివరాలు రాబట్టి కేసును చేధిస్తామని పోలీసులు తెలిపారు.
దళిత సంఘాల ఆందోళన
అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన నిందితులను అరెస్ట్ చేసిన కఠినంగా శిక్షించాలని కోరుతూ దళిత సంఘాల నాయకుల ఆధ్వర్యంలో మధ్యాహ్నం ముద్దాపురం ఆర్అండ్బీ రోడ్డుపై రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. సాయంత్రం దువ్వ జాతీయ రహదారిపై రాస్తారోకో, నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాల్లో జిల్లాలోని వివిధ దళిత అంబేడ్కర్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఘటనా స్థలిని ఎంపీపీ రుద్రా ధనరాజు, జెడ్పీటీసీ సభ్యురాలు ముళ్లపూడి అన్నపూర్ణాదేవి, పార్టీ మండల అధ్యక్షుడు పోలేపల్లి వెంకట ప్రసాద్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు బోడపాటి వీర్రాజు, రైతు విభాగం మండల అధ్యక్షుడు దండు వెంకట కృష్ణంరాజు, నియోజకవర్గ ఎస్సీ సెల్ అధ్యక్షుడు పొట్ల సురేష్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు జంగం ఆనందకుమార్, తణుకు పట్టణ అధ్యక్షుడు మంగెన సూర్య, నాయకులు తుమ్మగంటి సత్యనారాయణ, సర్పంచ్ మజ్జి పద్మ, ఎంపీటీసీ సభ్యులు సందర్శించారు. దళిత సంఘాల ఆందోళనకు సంఘీభావం తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
తణుకు టౌన్ : తణుకు రూరల్ మండలం ముద్దాపురం పాఠశాల ఆవరణలో ఉన్న అంబేడ్కర్ విగ్రహం తల భాగం తొలగించడం దారుణమని, నిందితులు ఎంతటివారైన కఠినంగా శిక్షించాలని పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పోలీస్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గించడం ద్వారా లబ్ధిపొందాలని కొన్ని దుష్ట శక్తులు ప్రయత్నిస్తున్నాని మంత్రి ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం వెనుక ఉన్న వారెవరైనా ఉపేక్షించబోమమని అన్నారు. తణుకు నియోజకవర్గం ప్రశాంతతకు మారుపేరని, ముద్దాపురం వంటి పచ్చని పల్లెటూరులో కుల విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని మంత్రి కారుమూరి పేర్కొన్నారు.
తలభాగం తొలగించిన దుండగులు
దళిత సంఘాల ఆందోళన
