హసన్పర్తి: కృత్రిమ మేధస్సు ప్రపంచ ఆర్థిక వ్యవస్థను వేగంగా మార్చేస్తోందని ఎస్ఆర్ వర్సిటీ వీసీ దీపక్ గార్గ్ అన్నారు. ఎస్సార్ యూనివర్సిటీ అస్ట్రా స్కూల్ ఆఫ్ బిజినెస్ ఆధ్వర్యంలో ‘స్ట్రాటజీ అనలిటిక్స్ టెక్నాలజీ అండ్ కల్చర్’ (ఎస్ఏటీటీ) అంశంపై రెండు రోజుల సదస్సు శుక్రవారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఆయన హాజరై మాట్లాడుతూ కోడింగ్ చేయడంతో అనేక పనులను ఏఐ వ్యవస్థలు సమర్థవంతంగా నిర్వహిస్తున్నాయని తెలిపారు. మానవ సృజనాత్మకత, నిర్ణయ సామర్థ్యం, భావోద్వేగ అవగాహన వంటి అంశాలు సంస్థల అభివృద్ధికి కీలకమన్నారు. ఆరిఫ్టి టెక్నాలజీ సీహెచ్ఆర్ఓ రాంచందర్ మాట్లాడుతూ సంస్థలు పోటీల్లో నిలవాలంటే వ్యూహం, అనలిటిక్స్, టెక్నాలజీ, సంస్థ సంస్కృతి, సమన్వయం కావాలన్నారు. ప్రస్తుతం హెచ్ఆర్ విభాగం పరిపాలనా పనులకు మాత్రమే పరిమితం కాకుండా సంస్థ మార్పులకు దారితీసే వ్యూహాత్మక విభాగంగా మారుతోందన్నారు. తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్కూల్ ఆఫ్ బిజినెస్ విభాగం డీన్ డాక్టర్ గురునాథం, డాక్టర్ ఎం.రాజ్యలక్ష్మి, డాక్టర్ అర్చనారెడ్డి, రమేశ్బాబు పాల్గొన్నారు.


