వరంగల్ లీగల్: మహిళలు ఉన్నతస్థానాలకు ఎదగడంలో సమాజం, కుటుంబ ప్రభావం ఉంటుందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ పేర్కొన్నారు. తల్లిదండ్రుల ఆకాంక్ష నెరవేర్చేందుకు గౌరవప్రదమైన ఈ వృత్తిని ఎంచుకున్నట్లు తెలిపారు. ఆదివారం ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా న్యాయమూర్తి నిర్మలాగీతాంబ శనివారం ‘సాక్షితో’ మాట్లాడారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
తల్లిదండ్రులు, భర్త ప్రేరణతోనే ఈ స్థాయికి..
జీవిత భాగస్వామి సహకారం.. మహిళలు ఉన్నత శిఖరాలకు ఎదగడానికి ఎంతో దోహదపడుతుంది. నేను ఈస్థాయికి రావడానికి ప్రేరణగా నిలిచిన నాన్న శ్రీనివాసాచారి, అమ్మ కస్తూరిబాయి, భర్త డాక్టర్ వినోద్కుమార్కు రుణపడి ఉంటా. పెరిగిన శాస్త్రసాంకేతికతతోపాటు మహిళలపై జరుగుతున్న హింస అనేక రూపాలుగా మారింది. సామాజిక మాధ్యమాలపై నియంత్రణ లేని కారణంగా ఉమ్మ డి కుటుంబ వ్యవస్థ విధ్వంసమైంది. పరుగెడుతు న్న జీవన ప్రయాణంలో తల్లిదండ్రుల పర్యవేక్షణా లోపం పిల్లల భవిష్యత్పై ప్రభావం చూపుతోంది.
న్యాయమూర్తిగా మహిళలు రాణించడం
ఆనందంగా ఉంది..
రాజ్యాంగం కల్పించిన హక్కులు, ఫలాలు అట్టడుగు స్థాయిన ఉన్న ప్రజలు, ప్రధానంగా మహిళలకు అందించడంలో న్యాయమూర్తిగా సంతృప్తికరంగా ఉన్నాను. జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్పర్సన్గా బాధిత యువతులకు పరిహారం ఇప్పించడం, వృద్ధులు, వితంతువులు, ట్రాన్స్జెండర్స్కు ఆర్థిక చేయూతనందించడం మరిచిపోలేను. న్యాయమూర్తులుగా మహిళలు అధిక సంఖ్యలో రాణించడం చాలా ఆనందంగా ఉంది. న్యాయమూర్తిగా సామాజిక బాధ్యతతో వ్యవహరిస్తే తద్వారా గౌరవిస్తారు.
2007లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికయ్యా..
ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన అనంతరం తండ్రి ఆకాంక్ష మేరకు నెల్లూరులోని వీఆర్ లా కాలేజీలో ఎల్ఎల్బీ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్ఎం (గోల్డ్ మెడల్) పూర్తిచేశా. 1994 నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశా. పంచాయతీరాజ్ శాఖ తరఫున గవర్నమెంట్ న్యాయవాదిగా, పలు సంస్థలకు స్టాండింగ్ కౌన్సిల్గా కొనసాగాను. అనంతరం 2007లో అదనపు జిల్లా జడ్జిగా ఎంపికై ప్రస్తుతం వరంగల్ జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ జడ్జిగా కొనసాగుతున్నా.
నాన్న శ్రీనివాసాచారి ఆకాంక్ష..
అమ్మ కస్తూరిబాయి అండదండలు..
భర్త వినోద్కుమార్ సహకారం
మరువలేనిది..
వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలాగీతాంబ


