● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ధర్మసాగర్: పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులకు న్యాయం జరుగుతుందనే నమ్మకం కలిగించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను గురువారం వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సందర్శించారు. ఈసందర్భంగా సీపీ ముందుగా పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధి గ్రామాలు, ఆయా గ్రామాల్లో ప్రజల జీవన శైలి, పోలీస్ స్టేషన్ పరిధిలో అధికంగా జరిగే నేరాలు, రౌడీ షీటర్లు, అనుమానితులు, పోలీస్ అధికారులు, సిబ్బంది పనితీరు, బీట్లు, పెట్రోలింగ్, రికార్డుల నిర్వహణపై స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ రావును అడిగి తెలుసుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన కేసులు, పెండింగ్లో ఉన్నవి, నిందితుల అరెస్ట్ కు సంబంధించి రికార్డులను సీపీ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఫిర్యాదులపై స్టేషన్ అధికారులు, సిబ్బంది తక్షణమే స్పందించాలని, విధి నిర్వహణలో అలసత్వంతో వ్యవహరించకుండా విధులు నిర్వహించాలని, ముఖ్యంగా పారదర్శకంగా విధులు నిర్వహిస్తూ ప్రజల అభిమానాన్ని పొందాలని సీపీ పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ వెంట సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, కాజీపేట ఏసీపీ ప్రశాంత్రెడ్డితో పాటు, ఎస్ఐలు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


