
మిషనరీస్ ఆఫ్ చారిటీలో వైద్యశిబిరం
వరంగల్: ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని (వరల్డ్ మెంటల్ హెల్త్ డే) పురస్కరించుకుని వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యం.సాయికుమార్ అధ్యక్షతన కాశిబుగ్గలోని ‘మిషనరీస్ ఆఫ్ చారిటీ’లోని మేధో దివ్యాంగులైన చిన్నారులకు ఉచిత వైద్య శిబిరాన్ని శుక్రవారం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్ పర్సన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి వీబీ నిర్మలా గీతాంబ హాజరై మాట్లాడుతూ.. ‘మానసిక దివ్యాంగులను చేరదీసి, వారిని ఏ విషయంలోనూ తక్కువ చేసి చూడొద్దన్నారు. న్యాయ సేవలు, సహకారం కోసం న్యాయ సేవాధికార సంస్థను సంప్రదించాలన్నారు. భవిష్యత్లో వీరికి కావాల్సిన అన్ని రకాల వైద్య సేవలకు తమను సంప్రదించవచ్చని సూచించారు. దివ్యాంగులకు సేవ చేస్తున్న సిబ్బందిని ఆమె అభినందించారు. అనంతరం మేధో దివ్యాంగులకు పండ్లు, స్వీట్లు అందించి, వారితో సరదాగా గడిపారు. డిప్యూటీ లీగల్ ఎయిడ్ కౌన్సిల్ శ్రీనివాసరావు, ఇంతేజార్గంజ్ ఎస్ఐలు తేజ, వెంకటేశ్వర్లు, డాక్టర్ క్యూరీ, డాక్టర్ అనూహ్య, సిస్టర్ సవీన మరియా, సిస్టర్ అంజలిక మరియా పాల్గొన్నారు.