
కలెక్షన్లో ‘కార్పొరేషన్’ ఫెయిల్
వరంగల్ అర్బన్: పన్నుల వసూళ్లలో గ్రేటర్ వరంగల్ చతికిల పడింది. ఫస్ట్ ఆఫ్ ఆరు నెలల వ్యవధిలో ఆస్తి పన్ను 25 శాతం, నీటి చార్జీలు 12 శాతం వసూళ్లతో సరిపెట్టుకున్నారు. గణాంకాలను పరిశీలిస్తే బల్దియా ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపం, క్షేత్ర స్థాయి సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టమవుతోంది. వరంగల్ మహా నగర పాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ)కి ప్రధాన ఆదాయ వనరు పన్నులు. డిమాండ్ మేరకు ఏటా ఆస్తి, నీటి పన్నులు కచ్చితంగా వసూలు చేస్తేనే స్థానిక సంస్థలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులకు ఆస్కారం ఉండదు. కొత్త ఇంటి నంబర్ల జారీ, భవనాల రివైడ్జ్, పేరు మార్పిడుల పేరిట కాసుల కోసం వేట కొనసాగిస్తున్నారే తప్ప పన్ను వసూళ్లపై సరైన కార్యాచరణతో ముందుకు సాగట్లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదిలో పన్నుల వసూళ్లను ఫస్ట్, ఆఫ్ సెకండ్ ఆఫ్గా వసూలు చేస్తుంటారు. ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు, రెండో దఫా అక్టోబర్ 1 నుంచి మార్చి 31 వరకు వర్గీకరించి పన్నులు వసూలు చేస్తుంటారు. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల ఆదేశాల మేరకు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్ (సీజీజీ)సూచనల మేరకు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది ఏడాదికి ఒకేసారి డిమాండ్ నోటీస్ జారీ చేశారు. కానీ, అందులో ఆర్నెళ్లకోసారి చెల్లించుకునే పొందుపర్చారు.
వసూళ్లు ఇలా..
మహా నగర వ్యాప్తంగా ఆస్తి పన్ను అసెస్మెంట్లు 2,28,901 కాగా, 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.81.18 కోట్లు, వడ్డీ రూ.46.06 కోట్లు, పాత బకాయిలు రూ.43.60 కోట్లు మొత్తంగా రూ.170.80 కోట్లు వసూళ్లే లక్ష్యంగా పెట్టుకున్నారు. అందులో ఇప్పటి వరకు ఆస్తి పన్ను రూ.42.10 కోట్లు అంటే 25 శాతం వసూలు చేశారు. ఇకపోతే తాగునీటి నల్లా కనెక్షన్లు 1,77,567 ఉండగా.. రూ.49.70 కోట్లు కరెంటు, పాత బకాయిలు రూ.25.28 కోట్లు కాగా, మొత్తంగా రూ.74.99 కోట్లు డిమాండ్ నెలకొంది. ఇందులో 8.87 కోట్లు అంటే 12 శాతం మాత్రమే వసూలు చేశారు. సర్కారీ శాఖల నుంచి పెద్ద మొత్తంలో ఆస్తి, నీటి చార్జీలు వసూలు చేయాల్సి ఉన్నా, ఆ సొమ్మును రాబట్టుకునేందుకు చొరవ తీసుకునే నాథుడే బల్దియా యంత్రాంగంలో కరువయ్యారనే విమర్శలు నెలకొన్నాయి.
లోపం యంత్రాంగానిదే...
పన్ను బకాయిలు పెరిగిపోవడానికి, సక్రమంగా వసూలు కాకపోవడానికి యంత్రాంగం వైఫల్యమే ప్రధాన కారణం. ప్రజలకు నోటీసులు జారీ చేయడంతో సరిపెట్టకుకోకుండా ప్రజలు సక్రమంగా చెల్లిస్తున్నారా? చెల్లించని వారికి ఆ సొమ్ముపై 2శాతం వడ్డీ భారం తోడవుతుందని చెల్లింపుదారుల్లో చైతన్యం కల్పించడంతో విఫలమవుతున్నారు. కేత్ర స్థాయిలో పన్నుల వసూళ్లను పర్యవేక్షించాల్సిన రెవెన్యూ ఆఫీసర్లు, ఇన్స్పెక్టర్లు, వార్డు ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు కలిసి వసూళ్ల బాధ్యత ఇ–సేవా కేంద్రాల సిబ్బందికి వసూళ్ల బాధ్యతలను అప్పగిస్తూ ఇతర పనుల్లో నిమగ్నమవుతున్నారనే అరోపణలున్నాయి. ఆస్తి, నీటి చార్జీలు ఫస్ట్ ఆఫ్లో వెనుకబడిపోవడానికి పన్నుల విభాగం అధికారులను వివరణ కోరితే ఎవరికి వారు దాటవేస్తుండడం గమనార్హం.
ఫస్ట్ ఆఫ్లో ఆస్తి పన్ను 25% నీటి చార్జీలు కేవలం 12% వసూలు
నిద్రావస్థలో పన్నుల విభాగం అధికారులు
జీడబ్ల్యూఎంసీ ఆర్థిక పరిస్థితిపై
తీవ్ర ప్రభావం