కాళోజీ సెంటర్: ఇంటర్మీడియట్ ప్రభుత్వ, ప్రైవేట్ జూనియర్ కళాశాలల్లోని బోధన, బోధనేతర సిబ్బంది ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ వివరాలను జిల్లా ఇంటర్మీడియట్ కార్యాలయంలో పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించి ఆమోదించనున్నట్లు డీఐఈఓ డాక్టర్ శ్రీధర్ సుమన్ సోమవారం ఒక ప్రకటలో తెలిపారు. డీఐఈఓ ఆమోదం పొందిన సిబ్బందికి ప్రత్యేక యూనిక్ ఐడీ జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.
ఇంటర్మీ డియట్ బోర్డు వెబ్సైట్ https// acadtgbie.cgg.gov.in ద్వారా ఆధార్, బ్యాంక్ ఖాతా, పాన్ నంబర్, అపాయింట్మెంట్ తేదీ, పుట్టిన తేదీ వంటి అన్ని వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని సిబ్బందికి సూచించారు. డాక్యుమెంట్లను భౌతికంగా పరిశీలించేదుకు ఆయా కళాశాలలకు ప్రత్యేక షెడ్యూల్ రూపొందించినట్లు పేర్కొన్నారు. 8, 9వ తేదీల్లో ప్రైవేట్ కళాశాలలు, 14, 15, 16వ తేదీల్లో ప్రభుత్వ కళాశాలల సిబ్బంది వివరాలను, మొత్తం 864 మంది బోధన, బోధనేతర సిబ్బంది డాక్యుమెంట్లను పరిశీలించి అఫ్రూవ్ చేయనున్నట్లు డీఐఈఓ స్పష్టం చేశారు.
యుద్ధప్రాతిపదికన పనులు పూర్తి చేయండి
రామన్నపేట: డివిజన్లో పెండింగ్లో ఉన్న పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అన్నారు. నగరంలోని 29వ డివిజన్లో సోమవారం పర్యటించి పెండింగ్లో ఉన్న పైప్లైన్ పనులు, సీసీ కెమెరాల ఏర్పాటు, నూతన విద్యుత్ స్తంభాల ఏర్పాటు, శానిటేషన్, తదితర పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. డివిజన్లో పైప్లైన్ పనుల్ని వెంటనే పూర్తి చేయాలని, ప్రధాన జంక్షన్లలో హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసి వాటికి సీసీ కెమెరాలు అమర్చాలని అధికారులను ఆదేశించారు. పాత విద్యుత్ స్తంభాల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఈ శ్రీకాంత్, సాయికుమార్ పాల్గొన్నారు.
చెత్తను తొలగించండి..
డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు తొలగించాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. సోమవారం నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడ వాటర్ ట్యాంక్తో పాటు గోపాలస్వామి గుడి ఎదురు గల్లీ ప్రాంతాల్లో మేయర్ క్షేత్ర స్థాయిలో పర్యటించి సిబ్బంది నిర్వహించాల్సిన విధులపై ఆదేశాలు జారీ చేశారు. 24, 28, 29 డివిజన్లో నీటి సరఫరాలో అంతరాయం కలిగిన నేపథ్యంలో వాటర్ ట్యాంక్ పరిశీలించి నూతన వాల్వ్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోపాలస్వామి గుడి ప్రాంతంలో మేయర్ డ్రెయిన్లో పేరుకుపోయిన చెత్తను శుభ్రం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ రామ తేజస్వి శిరీష్, శానిటరీ డీఈ రాగి శ్రీకాంత్, సూపర్వైజర్ శీను, ఏఈ హబీబ్ పాల్గొన్నారు.
దేవాదుల మొదటి మోటార్ ట్రయల్ రన్ సక్సెస్
హసన్పర్తి : దేవాదుల ప్రాజెక్ట్–3వ దశలో భాగంగా నిర్వహించిన ట్రయన్ రన్ విజయవంతమైంది. సోమవారం మొదటి మోటారును రన్ చేశారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం దేవన్నపేటలోని పంప్హౌజ్ నుంచి ధర్మసాగర్ రిజర్వాయర్లోకి నీటిని విడుదల చేశారు. ఐదు నెలల క్రితం రెండో మోటారును నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ప్రారంభించారు. మూడో మోటారు ట్రయల్ రన్కు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈఈ మంగీలాల్, బాలకృష్ణ, డీఈఈ రమాకాంత్, ఓంసింగ్, ఏఈ శ్రీనివాస్, రాకేశ్, యశ్వంత్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
9న జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు
విద్యారణ్యపురి: ఈనెల 9న హనుమకొండలోని లష్కర్బజార్ ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఉదయం 9:30 గంటలకు జిల్లా స్థాయి సైన్స్ డ్రామా పోటీలు నిర్వహించనున్నట్లు హనుమకొండ డీఈఓ డి.వాసంతి, జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి సోమవారం తెలిపారు. ‘డ్రామా ఉమెన్ ఇన్ సైన్స్, స్మార్ట్ అగ్రికల్చర్, డిజిటల్ ఇండియా ఎంపవరింగ్ లైఫ్స్, హైజిన్ ఫర్ ఆల్, గ్రీన్ టెక్నాలజీస్’ అంశాల్లో డ్రామా పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు జిల్లా సైన్స్ అధికారి ఎస్.శ్రీనివాసస్వామి 94901 12848 నంబర్లో సంప్రదించాలని డీఈఓ వాసంతి కోరారు.