
రైతులు ఆందోళన చెందొద్దు
నర్సంపేట: గత సంవత్సరం కంటే ఎక్కువగా యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులు ఆందోళన చెందవద్దని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శనివారం వ్యవసాయ, సహకార, రెవెన్యూ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి యూరియా కొరతతో రైతులు పడుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాధవరెడ్డి మాట్లాడుతూ సహకార సంఘం, వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి డీలర్ల నుంచి రైతులకు యూరియా, ఎరువులు పంపిణీ జరిగేలా చూడాలని ఆదేశించారు. లేనిపక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు అల్ప సంతోషంతో రైతులను రెచ్చగొడుతూ పత్రికల్లో ప్రకటన కోసం హడావుడి చేస్తున్నాయని పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి అనూరాధ, ఆర్డీఓ ఉమారాణి, ఏడీఏ దామోదర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
గత సంవత్సరం కంటే ఎక్కువగా
యూరియా నిల్వలు
సమీక్షలో నర్సంపేట ఎమ్మెల్యే
దొంతి మాధవరెడ్డి