‘పట్టు’కు ప్రభుత్వ ప్రోత్సాహం | - | Sakshi
Sakshi News home page

‘పట్టు’కు ప్రభుత్వ ప్రోత్సాహం

Jun 28 2025 5:22 AM | Updated on Jun 28 2025 9:02 AM

రాయితీ అందిస్తున్న కేంద్రం

హన్మకొండ: పట్టు పరిశ్రమల స్థాపనకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహాన్ని అందిస్తోంది. ఈక్రమంలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలనుకునే వారికి రాయితీని అందిస్తోంది. పట్టు పరిశ్రమ వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ, తక్కువ పెట్టుబడితో అధిక లాభం పొందగలిగే పట్టు పరిశ్రమ చిన్న సన్నకారు రైతుల ఆర్థికాభివృద్ధికి తోడ్పడుతోంది. మల్బరీ పట్టు పురుగుల పెంపకం రైతులకు మంచి లాభదాయకం. తక్కువ పెట్టుబడితో, తక్కువ సమయంలోనే ఎక్కువ దిగుబడిని పొందవచ్చు. సంప్రదాయ పంటలతో పోలిస్తే పట్టుపురుగుల పెంపకం లాభసాటిగా మారింది. దీనిద్వారా ప్రతి నెలా నికర ఆదాయం పొందవచ్చు. 25 రోజుల్లో పంట చేతికి వస్తుంది. ఒకసారి నాటిన మల్బరీ తోట నుంచి 15 నుంచి 20 ఏళ్ల వరకు ఉపాధి పొందవచ్చు. షెడ్డు నిర్మాణం, మల్బరీ మొక్కలు, ఇతర పరికరాలకు ప్రభుత్వం నుంచి రాయితీని పొందవచ్చు. హనుమకొండ జిల్లాలో 202 ఎకరాల్లో మల్బరీ సాగు చేస్తున్నారు. 2025–2026 ఆర్థిక సంవత్సరంలో అదనంగా 175 ఎకరాల్లో మల్బరీ సాగు చేయాలని, 3,19,900 పట్టు గుడ్ల ద్వారా 2,30,328 పట్టు కాయల ద్వారా 38,388 కిలోల పట్టుదారాన్ని ఉత్పత్తి చేయాలని ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటి వరకు 81 ఎకరాలను మల్బరీ తోట పెంపకానికి గుర్తించారు. ప్రస్తుతం జిల్లాలో 8 మండలాల్లో 51 గ్రామాల్లో 97 మంది పట్టు పరిశ్రమ నిర్వహిస్తున్నారు.

రాయితీ వివరాలు..

పట్టు పరిశ్రమను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. మల్బరీ తోటల పెంపకానికి రెండు ఎకరాలకు రూ.60 వేలు సహాయాన్ని రాయితీ రూపేణా అందిస్తోంది. పట్టు పురుగుల పెంపకానికి గది నిర్మాణానికి రూ.2.25 లక్షలు, స్టాండ్స్‌, ఇతర పరికరాలకు రూ.37,500, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారక మందుల కోసం రూ.2,500, నీటి పారుదల కోసం రూ.50 వేలు రాయితీగా ప్రభుత్వం అందిస్తోంది. అదే విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మల్బరీ తోట నాటుట, నిర్వహణకు రూ.41,500, షెడ్డు నిర్మాణానికి 1,03,040 చెల్లిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు మల్బరీ తోట పెంపకం, నిర్వహణకు రూ.78 వేలు, షెడ్‌ నిర్మాణానికి రూ.2,92,500, రేరింగ్‌ పరికరాలకు రూ.26,610, రేరింగ్‌ స్టాండ్స్‌కు 24,140, రోగ నిరోధక చర్యలు, క్రిమి సంహారాలకు రూ.3,250, నీటి పారుదల సదుపాయానికి రూ.65 వేలు రాయితీగా చెల్లిస్తోంది.

పట్టు పరిశ్రమతో ఆర్థికాభివృద్ధి

పట్టు పరిశ్రమతో రైతులు ఆర్థికాభివృద్ధి సాధించవచ్చు. ఇది మంచి లాభదాయక పంట. పట్టు పరిశ్రమ చేపట్టేందుకు ప్రభుత్వం రాయితీని అందిస్తోంది. ఈ రాయితీతో తక్కువ ఖర్చుతో పట్టు పరిశ్రమ నడుపవచ్చు. ప్రతీ నెల నికర ఆదాయం వస్తుంది. ప్రభుత్వం అందిస్తున్న రాయితీని సద్వినియోగం చేసుకుంటూ రైతులు పట్టు పరిశ్రమ వైపు ముందుకు రావాలి.

– జి.అనసూయ, హనుమకొండ జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమశాఖ అధికారి

‘పట్టు’కు ప్రభుత్వ ప్రోత్సాహం1
1/3

‘పట్టు’కు ప్రభుత్వ ప్రోత్సాహం

‘పట్టు’కు ప్రభుత్వ ప్రోత్సాహం2
2/3

‘పట్టు’కు ప్రభుత్వ ప్రోత్సాహం

‘పట్టు’కు ప్రభుత్వ ప్రోత్సాహం3
3/3

‘పట్టు’కు ప్రభుత్వ ప్రోత్సాహం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement