
సౌదీలో చిక్కుకున్న కొప్పూరు వాసి
లక్డీకాపూల్: సౌదీ ఏడారిలో చిక్కుకుని దుర్భరజీవనాన్ని సాగిస్తున్న తన భర్తను కాపాడి స్వదేశానికి తీసుకురావాలని ఓ భార్య మొర పెట్టుకుంది. ఈమేరకు హైదరాబాద్లోని ప్రజాభవన్లో శుక్రవారం నిర్వహించిన ప్రవాసీ ప్రజావాణిలో విన్నవించింది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ భార్య లత తన ఇద్దరు కూతుళ్లతో ప్రజాభవన్కు వచ్చింది. ‘ఈశ్వర్ కుటుంబం భవిష్యత్ కోసం 2017లో సౌదీ అరేబియాకు వెళ్లాడు. అక్కడ మొదట హౌస్ డ్రైవర్గా పని చేశాడు. కొద్ది నెలల్లోనే పని కోల్పోయి నిరాశ్రయుడయ్యాడు. మండే ఎండల్లో.. ఖర్జూర తోటలో కూలీగా చేరి అక్కడే చిక్కుకుపోయాడు. స్వదేశానికి చేరే మార్గం తెలియక ఏడేళ్లుగా కుమిలిపోతున్నాడు. అఖామా, వీసా గడువు ముగిసిపోయింది. సౌదీ పాస్పోర్ట్ అధికారుల వద్ద జమ చేయడం వల్ల ఈశ్వర్ ఖర్జూర తోటలో కూలీగా చేరాడు. ఎలాగైనా నా భర్తను స్వదేశానికి తీసుకురావాలి’ అని ఈశ్వర్ భార్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని వేడుకుంది. ఎన్నారై అడ్వయిజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీంరెడ్డి సహకారంతో ఈమేరకు ఆమె ప్రవాసీ ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించింది. విషయం తెలుసుకున్న రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జీఏడీ ఎన్నారై అధికారులతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కాగా.. సౌదీ నుంచి స్వదేశానికి పంపించడంలో ఎదురయ్యే ఇబ్బందులను తొలగించడానికి ఇప్పటికే కరీంగర్కు చెందిన సామాజిక కార్యకర్త మొహమ్మద్ జబ్బార్ సహాయాన్ని అర్థించామని లత పేర్కొంది. ఈక్రమంలో రియాద్లోని భారత రాయబార కార్యాలయంతో సంప్రదించి ఈశ్వర్ను స్వదేశానికి రప్పించాలని ఆమె తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.
స్వదేశానికి తీసుకురావాలని ప్రవాసీ ప్రజావాణిలో కుటుంబీకుల వేడుకోలు