
నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు
ఖిలా వరంగల్: నకిలీ విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వర్ధన్నపేట ఏడీఏ నరసింగం, ఖిలా వరంగల్ మండల వ్యవసాయధికారి రవీందర్రెడ్డి హెచ్చరించారు. వరంగల్ స్టేషన్ రోడ్డు, ఫోర్ట్ రోడ్డులోని ఎరువులు, విత్తన దుకా ణాల్లో వ్యవసాయ, పోలీసు శాఖ అధికారులు గురువారం తనిఖీలు నిర్వహించారు. 25 షాపులను తనిఖీ చేసి రికార్డులు,విత్తనాల అమ్మకాలు, అనుమతి, కంపెనీ గుర్తింపును అడిగి తెలుసుకున్నారు. నిషేధించిన విత్తనాలు అమ్ముతున్నారా అని ఆరా తీశారు. గాయత్రి, అరుంధతి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులను తనిఖీ చేశారు. స్టేషన్రోడ్డులోని ఓ షాపు నిర్వాహకులు కళాష్ సీడ్స్ కంపెనీ వారి విత్తన లైసెన్స్ రెన్యువల్ కాపీని అధికారులకు చూపించలేదు. దీంతో రూ.6,85,980 విలువైన 580 పత్తి ప్యాకెట్లు, మిర్చి ప్యాకెట్ల విక్రయాలను నిలిపివేయించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ లైసెన్స్ ఉన్న షాపులోనే రైతులు విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. పంట ముగిసే వరకు విత్తన బిల్లులను భద్రపర్చుకోవాలని చెప్పారు. తనిఖీల్లో వ్యవసాయ శాఖ అధికారులు యాకయ్య, విజయ్, హెడ్కానిస్టేబుల్ కరుణాకర్, సిబ్బంది పాల్గొన్నారు.