
కుమారుల నుంచి ఆస్తిని బదలాయించాలి
తనను పోషించలేని కుమారులనుంచి ఆస్తిని బదలాయించి, న్యాయం చేయాలని పరకాల మండలం నాగారం గ్రామానికి చెందిన గుండెబోయిన చిన్న ఐలయ్య ప్రజావాణిలో కలెక్టర్ను కోరారు. గతంలో కలెక్టర్కు వినతిపత్రం అందించగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఓను ఆదేశించారని, భూమి రద్దు చేయడం తమ పరిధిలో లేదని, కుటుంబ సభ్యులే పరిష్కరించుకోవాలని సూచించినట్లు చిన్న ఐలయ్య వివరించారు. రెండు నెలలుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న తన సమస్య పరిష్కారం కావడం లేదని మొత్తుకున్నాడు. పెద్ద కుమారుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడని, చిన్న కుమారుడు వ్యవసాయం చేస్తాడని, ఇద్దరు తమను పట్టించుకోవడం లేదని కలెక్టర్ న్యాయం చేయాలని కోరారు.
– గుండెబోయిన చిన్న ఐలయ్య, నాగారం
సెకండియర్ బోధన చేయలేమంటున్నారు
ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో విద్యా బోధన అందించలేమని, ఇతర కళాశాలల్లోకి వెళ్లాలని హనుమకొండ నయీంనగర్లోని ఆర్డీ జూనియర్ కళాశాల యాజమాన్యం తెలిపిందని ఆ కళాశాల విద్యార్థులు తెలిపారు. సోమవారం ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేసేందుకు ఇంటర్ మొదటి సంవత్సరం చదివిన విద్యార్థులు వచ్చారు. ఆర్డీ కళాశాలలో ఎస్సీ విద్యార్థులకు ఉచిత విద్యాబోధన అందిస్తున్నారని, తమకు ప్రభుత్వం నుంచి రావాల్సిన డబ్బులు రావడం లేదని, ద్వితీయ సంవత్సరం ఇతర కాలేజీల్లో చేరాలని అధ్యాపకులు చెప్పారని వివరించారు. తాము ఏ కాలేజీలో చేరాలో అర్థం కావడం లేదని, కలెక్టర్ స్పందించి న్యాయం చేయాలని వారు కోరారు.

కుమారుల నుంచి ఆస్తిని బదలాయించాలి