
కోనారెడ్డి చెరువు సర్వే
వర్ధన్నపేట: వర్ధన్నపేటలోని కోనారెడ్డి చెరువును శుక్రవారం నీటిపారుదల, రెవెన్యూ శాఖ అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించారు. కోనారెడ్డి చెరువుకు వెళ్లే దారులతోపాటు శిఖం భూములను కబ్జా చేశారంటూ ఈ నెల 10న కలెక్టర్కు అందిన ఫిర్యాదు మేరకు అధికారులు రంగంలోకి దిగారు. మత్తడి, ఎఫ్టీఎల్ భూభాగాలను పరిశీలించారు. 0.25 టీఎంసీల సామర్థ్యం కలిగిన కోనారెడ్డి చెరువు విస్తీర్ణం 478.6 ఎకరాలు ఉందని తహసీల్దార్ విజయసాగర్ తెలిపారు. సర్వే తర్వాత చెరువు ఏమేరకు ఆక్రమణకు గురైందో తెలుస్తుందని పేర్కొన్నారు. శిఖం భూములను ఎవరైనా ఆక్రమించడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. అధికారుల అండతోనే అక్రమార్కులు చెరువు కబ్జా చేశారని స్థానికులు ఆరోపించారు. కబ్జాదారులను అధికారులు కాపాడేందుకు ప్రయత్నిస్తే సహించబోమని వారు స్పష్టం చేశారు.