అయ్యో పాపం.. అటవీ జంతువులు | - | Sakshi
Sakshi News home page

అయ్యో పాపం.. అటవీ జంతువులు

Mar 17 2025 10:26 AM | Updated on Mar 17 2025 10:25 AM

పాకాల సమీపంలో వేటగాళ్లు వదిలివెళ్లిన

వన్యప్రాణి కళేబరాన్ని పరిశీలిస్తున్న ఆర్టీసీ డ్రైవర్‌,

కండక్టర్‌, స్థానికులు

అడవి అంటే.. కొండలు, కోనలు.. గలగల పారే వాగులు, వంకలు, నదులు, సెలయేళ్లు, ఆకాశాన్ని తాకే చెట్లు, ఆకర్షించే పచ్చదనం. వీటన్నింటిపై ఆధారపడి జీవించే జంతువులు ఎన్నో ఉంటాయి. ప్రస్తుతం అటవీ సంపద తరిగిపోతోంది. ముఖ్యంగా వన్యప్రాణులు కనుమరుగవుతున్నాయి. వేసవిలో దాహం కోసం మైదాన ప్రాంతాలకు వెళ్తున్న వన్య ప్రాణులను వేటగాళ్లు బలి తీసుకుంటున్నారు. దీంతో జీవవైవిధ్యం దెబ్బతిని, కాలాల్లో మార్పులు కూడా సంభవిస్తున్నాయి.

నర్సంపేట: వన్యప్రాణులు దాహార్తికి అల్లాడుతున్నాయి. నీటి కోసం మైదాన ప్రాంతాలకు వచ్చి వేటగాళ్ల ఉచ్చులకు బలవుతున్నాయి. ప్రస్తుతం ఎండా కాలంలో తాగునీటి సమస్య కూడా వారికి కలిసివస్తోంది. అటవీశాఖ అధికారులు వన్యప్రాణులకు తాగునీటి వసతి కల్పించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.

మూడు జిల్లాల్లో పాకాల అభయారణ్యం..

ఖానాపురం మండలంలోని పాకాల అభయారణ్యం మహబూబాబాద్‌ జిల్లా కొత్తగూడ, గంగారం, వరంగల్‌ జిల్లా ఖానాపురం, నర్సంపేట, ములుగు జిల్లా ఎస్‌ఎస్‌ తాడ్వాయి మండలాల్లో విస్తరించి ఉంది. ఇక్కడి వన్యప్రాణులకు పాకాల సరస్సు ఆయువుపట్టుగా ఉంటుంది. సరస్సు కాల్వలో పారే నీటిని తాగి అవి జీవనం గడుపుతున్నాయి. అయితే, ప్రస్తుతం నీటి వనరులు తగ్గడంతో దుప్పులు, కుందేళ్లు, జింకలు, అడవి పందులు, కొండగొర్రెలు తదితర జంతువులు నీటి కోసం మైదాన ప్రాంతాలకు వస్తూ ప్రాణాలు కోల్పోతున్నాయి.

పట్టణాల్లో మాంసం విక్రయాలు..

ఇలా బలి తీసుకున్న అటవీ జంతువుల మాంసాన్ని నర్సంపేట, వరంగల్‌, హనుమకొండ, ములుగు, మహబూబాబాద్‌ తదితర పట్టణాల్లో విక్రయిస్తున్నారు. అటవీ సమీప గ్రామాల వేటగాళ్లు మాంసాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఎవరికి అనుమానం రాకుండా సంచులు, పెద్ద పెద్ద టిఫిన్‌ బాక్సులు తదితర వాటిల్లో తరలిస్తున్నారు. జంతువు ఆధారంగా కిలో మాంసం రూ.500 నుంచి రూ.వెయ్యి వరకు విక్రయిస్తున్నారు. పక్కా ప్లాన్‌తో ఆటోలు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రైవేట్‌ వాహనాల్లో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.

తరిగిపోతున్న అటవీ సంపద

విలువైన కలప, వన్యప్రాణులు, జీవవైవిధ్యాన్ని కాపాడేందుకు అందరూ కృషిచేయాలి. ప్రభుత్వ నిర్లక్ష్యంతో అటవీ సంపద రోజు రోజుకు తరిగిపోతోందని ఆరోపణలు వస్తున్నాయి. వేసవి ప్రారంభంలో గుంతలు ఏర్పాటు చేసి తాగునీటి వసతి కల్పించకపోవడం, భూగర్భ జలాలు తగ్గిపోవడంతో అటవీ జంతువులు దప్పిక తీర్చుకునేందుకు రోడ్లు, గ్రామాలు, తండాలు, ఆదివాసీ గూడేల సమీపానికి వస్తున్నాయి. దీంతో వేటగాళ్లు వాటిని హతమార్చి మాంసం విక్రయిస్తున్నారు. ఇప్పటికై నా అటవీ శాఖ అధికారులు వన్యప్రాణులకు నీటి వసతి కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

పాకాలలో ఆటోకు ప్రమాదం

కొండగొర్రె, కనుజు

కళేబరాల స్వాధీనం

నలుగురిపై కేసు నమోదు : ఎఫ్‌ఆర్‌ఓ

కొండగొర్రె, కనుజు కళేబరాలను ఆటోలో తరలిస్తుండగా ఖానాపురం మండలంలోని పాకాలలో ఆదివారం ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. నలుగురు వ్యక్తులు ఉచ్చుల సాయంతో చంపిన కొండగొర్రెతోపాటు కనుజు కళేబరాలను ఆటోలో తరలిస్తున్నారు. పాకాల చెక్‌పోస్ట్‌ సమీపంలోకి రాగానే నర్సంపేట నుంచి కొత్తగూడ వైపు వస్తున్న బస్సును ప్రమాదవశాత్తు ఢీకొట్టారు. దీంతో ఒక యువకుడికి గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ బస్సులోని ప్రయాణికులు కిందకు దిగి చూశారు. భయాందోళనకు గురైన సదరు వ్యక్తులు ఆటోలో ఉన్న కొండ గొర్రెతోపాటు కనుజును అక్కడే వదిలేసి పరారయ్యారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌ఆర్‌ఓ రవికిరణ్‌ సిబ్బందితో కలిసి సంఘటనా స్థలానికి వెళ్లి కొండగొర్రె, కనుజు కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. పాకాలలో ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించగా చిలుకమ్మనగర్‌కు చెందిన సుధీర్‌, సుమన్‌, అశోక్‌నగర్‌కు చెందిన ఏకాంబరం, కొత్తగూడ మండలం మొండ్రాయికి చెందిన లవన్‌కుమార్‌ అటవీ జంతువులను చంపి తరలిస్తున్నట్లు గుర్తించారు. సుధీర్‌ను అదుపులోకి తీసుకొని విచారించగా మిగతా వారి వివరాలు వెల్లడించినట్లు తెలిసింది. చిలుకమ్మనగర్‌లోని సుమన్‌ వద్దకు వెళ్లగా వేలు విరిగి ఉండడంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారు. కొండగొర్రె, కనుజు కళేబరాలను స్వాధీనం చేసుకొని పంచనామా నిర్వహించారు. నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎఫ్‌ఆర్‌ఓ రవికిరణ్‌ తెలిపారు.

మండుతున్న ఎండలతో

తాగునీటికి ఇబ్బందులు

మైదాన ప్రాంతాలకు రావడంతో ప్రాణాలు తీస్తున్న వేటగాళ్లు

నీటి వసతి కల్పించడంలో

అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం

అయ్యో పాపం.. అటవీ జంతువులు1
1/1

అయ్యో పాపం.. అటవీ జంతువులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement