గీసుకొండ: ‘నాపై మీసం తిప్పినోళ్లు రాజకీయాల్లో పుట్టగతులు లేకుండా పోయిండ్లు.. పదవుల కోసం నాలుగు రోజులు వచ్చి పోయేవాళ్లతో ఏం కాదు.. మీకు నేనున్నా’ అంటూ మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి మీసం తిప్పుతూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపారు. కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర సందర్భంగా కొండా అభిమానులు అల్లం బాలకిశోర్రెడ్డి, వీరగోని రాజ్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భారీ ప్రభబండ్ల పనులను పరిశీలించడానికి బుధవారం ఆయన మనుగొండకు వచ్చి మాట్లాడారు. ఇన్ని రోజులకు నా సొంత మండలంలో మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎవరికీ భయపడవద్దని, తాను ఉన్నానని భరోసా ఇచ్చారు. కార్యకర్తలు, అభిమానులకు అందుబాటులో ఉండటానికి త్వరలో కోటగండి వద్ద ఆఫీసు నిర్మిస్తామన్నారు. ఏ కార్యకర్తకు, నాయకుడికి కష్టం వచ్చినా తన వద్దకు రావాలన్నారు. తొలుత కొండా మురళి మనుగొండలో భోజనం చేసి కొంత సమయం అభిమానులు, కార్యకర్తలతో గడిపారు. అనంతరం భారీ సంఖ్యలో కార్యకర్తలు బైక్లపై వెంటరాగా ర్యాలీగా కొమ్మాల స్టేజీ వద్దకు వెళ్లారు. అక్కడ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అల్లం బాలకిశోర్రెడ్డి, వీరగోని రాజ్కుమార్, మర్రెడ్డి, గోపాల నవీన్రాజు, రడం భరత్, డోలె చిన్న, తిరుపతి, రాజు, బొడిగె శోభన్, సురేశ్, కొంరయ్య, మాధవరావు, గడ్డమీది కుమారస్వామి, ఎడ్ల బాబు, కొమ్ముల కిశోర్, బాబూరావు, మైదంశెట్టి సాంబయ్య పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి