కొమ్మాల జాతరకు వేళాయె.. | - | Sakshi
Sakshi News home page

కొమ్మాల జాతరకు వేళాయె..

Mar 13 2025 11:17 AM | Updated on Mar 13 2025 11:17 AM

కొమ్మ

కొమ్మాల జాతరకు వేళాయె..

గీసుకొండ: మండలంలోని కొమ్మాల లక్ష్మీనర్సింహస్వామి జాతర 14వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. గుట్టచుట్టూ బండ్లు తిరిగే కార్యక్రమంతో జాతర ప్రారంభం కానుంది. జాతర విజయవంతానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి డీజేలు, రికార్డింగ్‌ డ్యాన్సులను నిషేధించగా.. రాజకీయ ప్రభలను పోలీసులు అనుమతిస్తున్నారు. జాతర ప్రాంతంలో సీసీ కెమెరాల నిఘా ఉంటుందని, 400 మంది పోలీసులతో బంధోబస్తు నిర్వహిస్తామని మామునూరు ఏసీపీ తిరుపతి తెలిపారు. ఈనెల 18న స్వామివారి రథోత్సవం ఉంటుందని ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు పేర్కొన్నారు.

గిర్నిబావి, కొమ్మాల స్టేజీలే కీలకం..

జాతరకు వచ్చే భక్తులతోపాటు తరలివచ్చే ప్రభ బండ్లతో వరంగల్‌–నర్సంపేట రహదారిలోని గిర్నిబావి, కొమ్మాల స్టేజీలు కిక్కిరిసిపోతాయి. గత జాతరల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈసారి అలాంటి పరిస్థితి రాకుండా చూస్తామని పోలీసులు చెబుతున్నారు. కొమ్మాల ఆలయ సింహద్వారం నుంచి జాతర లో ప్రవేశించే వారు తిరుగు ప్రయాణంలో గుట్టకింది (సూర్య)తండా మీదుగా వెళ్లాల్సి ఉంటుందని సీఐ మహేందర్‌ తెలిపారు.

హోరెత్తనున్న రాజకీయ ప్రభలు..

ఈసారి కూడా రాజకీయ ప్రభలు జాతరకు పోటెత్తనున్నాయి. నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్‌, మాజీ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్‌ ప్రభలు తరలిరానున్నాయి. గీసుకొండ మండలం నుంచి కాంగ్రెస్‌ తరఫున కొండా,రేవూరి వర్గాలు పోటీ పడి ప్రభలు తరలించడానికి సన్నాహాలు చేస్తున్నాయి.

చేసిన పనులకు బిల్లులు నిల్‌..

● పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి చొరవ మేరకు గుట్టవద్ద రూ.60 లక్షలతో మూడు టాయిలెట్‌ బ్లాక్‌లు నిర్మించారు. గుట్ట పరిసర ప్రాంతంలో రూ.7లక్షలతో రెండు సైడ్‌ కాల్వల నిర్మాణం పూర్తి చేశారు. గుడి నుంచి నాచినపల్లి రోడ్డుకు ఇరువైపులా రూ.ఐదు లక్షలతో మొరం పోయించారు. ఇంకా బ్యాటరీ ఆఫ్‌ ట్యాప్‌లు, రెండు బోర్ల పనులు పూర్తి చేసి ఏడాది గడుస్తున్నా బిల్లులు రాకపోవడంతో పనులు చేసిన వారు ఇబ్బందులు పడుతున్నారు.

రూ.4 కోట్ల అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు

● దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కొమ్మాల ఆలయ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సునీత, డీఈ రమేశ్‌ను ఇటీవల అదేశించారు. దీంతో వారు రూ.2 కోట్లతో భక్తుల కోసం జీప్లస్‌ వన్‌ సత్రాల నిర్మాణం, రూ.50 లక్షలతో గుట్టపై మండపాన్ని విస్తరించడం, కల్యాణ మండపం అభివృద్ధి, రథశాల నుంచి మెట్ల వరకు రేకుల మండపం.. ఇలా మొత్తం రూ.4 కోట్ల పనులకు అంచనాలు తయారు చేస్తున్నారు. నిధులు మంజూరు కాగానే పనులు ప్రారంభమవుతాయని కొండా వర్గం నాయకుడు రడం భరత్‌ తెలిపారు. అలాగే, ఆలయ ముఖద్వారం నుంచి గుట్ట వరకు 1.5 కిలోమీటర్ల మేర సీసీ డబుల్‌ రోడ్డు నిర్మాణానికి రూ.1.45 కోట్ల నిధులను ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి మంజూరు చేయించారని కాంగ్రెస్‌ పరకాల నియోజకవర్గ అధికార ప్రతినిధి చాడ కొమురారెడ్డి తెలిపారు. గుట్ట నుంచి నాచినపల్లి రోడ్డును రూ.52 లక్షలతో 600 మీటర్ల మేర నిర్మించడానికి, గుడి ప్రాంతంలో రూ.5 లక్షలతో రెండు చోట్ల హైమాస్ట్‌ లైట్ల ఏర్పాటుకు ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రాంరెడ్డి అంగీకరించగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. మంత్రి సురేఖ, ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి కృషి చేసి కొమ్మాల ఆలయాన్ని ‘మినీ యాదాద్రి’గా తీర్చిదిద్దాలని భక్తులు కోరుతున్నారు.

రేపు గుట్టచుట్టూ బండ్లు తిరిగే కార్యక్రమంతో ప్రారంభం

18న రథోత్సవం :

ఈఓ అద్దంకి నాగేశ్వర్‌రావు

డీజేలు లేకుండా రాజకీయ

ప్రభలకు అనుమతి

400 మంది పోలీసులతో బందోబస్తు

మామునూరు ఏసీపీ తిరుపతి

కొమ్మాల జాతరకు వేళాయె..1
1/1

కొమ్మాల జాతరకు వేళాయె..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement