దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి.. | - | Sakshi
Sakshi News home page

దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రావాలి..

Mar 12 2025 7:16 AM | Updated on Mar 12 2025 7:14 AM

హన్మకొండ చౌరస్తా: ‘పదేళ్లలో మీరు చేయలేని అభివృద్ధిని ఏడాదిలో మా ప్రభుత్వం చేసింది.. ఉట్టి మాటలు కాదు.. దమ్ముంటే వరంగల్‌ అభివృద్ధిపై చర్చకు రావాలి’ అని మాజీ మంత్రి హరీశ్‌రావుకు వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి సవాల్‌ విసిరారు. హనుమకొండలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీఆర్‌ఎస్‌ నాయకులపై ఆయన మండిపడ్డారు. ఆరు గ్యారంటీల అమలు హరీశ్‌రావుకు కనిపించకపోవడం బాధాకరమన్నారు. తెలంగాణ ఉద్యమానికి కేంద్ర బిందువులాంటి వరంగల్‌ను పదేళ్ల పాలనలో విస్మరించింది బీఆర్‌ఎస్‌ సర్కార్‌ కాదా? అని ప్రశ్నించారు. వరంగల్‌ను ఆరు ముక్కలుగా చేసి అస్తవ్యస్తం చేశారన్నారు. పదేళ్లలో ఒక్క ఇల్లు ఇవ్వలేని వీళ్లు.. నేడు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై మాట్లాడేందుకు సిగ్గుండాలన్నారు. మళ్లీ ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని సభ పేరుతో జిల్లాలో అడుగుపెడుతున్నారని ప్రశ్నించారు. కబ్జాలకు పాల్పడిన ఏ ఒక్కరినీ వదిలేది లేదని హెచ్చరించారు. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ, మాస్టర్‌ప్లాన్‌ వంటి అనేక అభివృద్ధి పనులకు నిధులు మంజూరు కానున్నట్లు తెలిపారు. అసెంబ్లీలో ప్రతిపక్షాన్ని అడిగేందుకు 15 ప్రశ్నలసు సిద్ధం చేశానని, ఆ ప్రశ్నలకు కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు ఎవరు సమాధానం చెప్పినా ఫర్వాలేదన్నారు. సమావేశంలో ‘కుడా’ చైర్మన్‌ ఇనగాల వెంకట్రామ్‌రెడ్డి, టీపీసీ సభ్యుడు బొద్దిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కార్పొరేషన్‌ ఫ్లోర్‌ లీడర్‌ తోట వెంకటేశ్వర్లు, ఎస్సీ డిపార్ట్‌మెంట్‌ జిల్లా ప్రెసిడెంట్‌ పెరుమాండ్ల రామకృష్ణ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు నాయకులు పాల్గొన్నారు.

హరీశ్‌రావుకు

ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి సవాల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement