
అధికారులతో సమావేశమైన కలెక్టర్ సిక్తా పట్నాయక్
పరకాల: ఎన్నికలు సమీపిస్తున్న దృష్ట్యా ఎలక్షన్ కమిషన్ ఆదేశాలను తప్పకుండా పాటిస్తూ ఓటరు జాబితా సిద్ధం చేయాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. పోలింగ్ స్టేషన్లలో ఏఎంఎఫ్ సాధన సౌకర్యాలు ఉన్నాయా అని తహసీల్దార్లు పరిశీలించి రిజిస్టర్లను తనిఖీ చేయాలన్నారు. వీటిపై నివేదికలు అందజేయాలని సూచించారు. పరకాలలో గురువారం ఏర్పాటు చేసిన నియోజకవర్గ ఓటరు జాబితా తయారీ, మార్పులు, చేర్పుల ప్రత్యేక కార్యక్రమానికి కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా రెవెన్యూ డివిజన్లోని అన్ని మండలాల తహసీల్దార్లతోపాటు బూత్ లెవల్ అధికారులను ఓటర్ల నమోదు, తొలగింపు చర్యలపై ఆరా తీశారు. ఓటర్ల జాబితాలో రెండు సార్లు ఒకరి పేరు వచ్చిన వారు ఉంటే పోలింగ్ స్టేషన్ ద్వారా గుర్తించి రెండో ఓటును తొలగించారా లేదా అని బీఎల్ఓల వద్ద ఉన్న జాబితాను తనిఖీ చేశారు. ఓటరు జాబితాలో కనిపించని ఫొటోల స్థానంలో కొత్తవి సేకరించారా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరకాల మండలంలోని రాజిపేట ప్రాథమిక పాఠశాల పోలింగ్ స్టేషన్ను కలెక్టర్ పరిశీలించారు. కేంద్రంలో ఉన్న సౌకర్యాలపై ఉపాధ్యాయులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్తోపాటు అదనపు కలెక్టర్ మహేందర్జీ, ఆర్టీఓ శ్రీనివాస్, పరకాల, ఆత్మకూరు, నడికూడ, గీసుకొండ మండలాల తహసీల్దార్లు, నాయబ్ తహసీల్దార్లు, ఎన్నికల అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్
పోలింగ్ స్టేషన్ల పరిశీలన