● రెవెన్యూ అదనపు కలెక్టర్
వినోద్కుమార్
వనపర్తి రూరల్: కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ముగిసిన వెంటనే మిల్లుకు తరలించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ వినోద్కుమార్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మండలంలోని కిష్టగిరి, నాచహళ్లి, మెంటేపల్లి, నర్సింగాయపల్లిలో కొనసాగుతున్న వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో ధాన్యం తూకాలు, మౌలిక వసతులు, రికార్డులను పరిశీలించడంతో పాటు రైతులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని కొనుగోలు కేంద్రాలకు సరిపడా గన్నీబ్యాగులు సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు తెచ్చిన ధాన్యం తేమ శాతం వచ్చిన వెంటనే తూకం చేసి కేటాయించిన మిల్లుకు తరలించాలని సూచించారు. ప్యాడీ క్లీనర్లను వినియోగించుకులానే రైతులకు అవగాహన కల్పించాలన్నారు. కొనుగోళ్లు పూర్తిచేసిన వెంటనే ట్యాబ్ ఎంట్రీలు పూర్తిచేసి డబ్బులు త్వరగా అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సరిపడా లారీలను సమకూర్చాలని రవాణా కాంట్రాక్టర్లను కోరారు.


