కొత్తకోట రూరల్: ప్రతి ఒక్కరూ ఆరోగ్య, జీవిత బీమా చేసుకుంటే ఆపత్కాలంలో బాధిత కుటుంబానికి భరోసా ఉంటుందని లీడ్ బ్యాంక్ మేనేజర్ శివకుమార్, డీఆర్డీఓ ఉమాదేవి అన్నారు. ఆదివారం పెద్దమందడి మండలంలోని పామిరెడ్డిపల్లిలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథులుగా హాజరైన వారు మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో ఉండే పేదలకు అందుబాటులో ఉండేలా కేంద్ర ప్రభుత్వం అనేక బీమా పథకాలను అమలు చేస్తుందని, సంవత్సరానికి కేవలం రూ.20 కడితే ప్రమాదవశాత్తు ఆ వ్యక్తి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.2 లక్షల బీమా అందుతుందని వివరించారు. ఆడపిల్లల కోసం సుకన్య సమృద్ధి యోజన, చిన్నారుల కోసం ఎన్పీసీ వాత్సల్య లాంటి దీర్థకాలిక పథకాల్లో పెట్టుబడి పెడితే భవిష్యత్లో వారి చదువులకు, పెళ్లిళ్ల సమయంలో తల్లిదండ్రులపై ఆర్థికభారం పడదన్నారు. డీఆర్డీఓ ఉమాదేవి మాట్లాడుతూ.. ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలని సూచించారు. మహిళాల సంఘాల సభ్యులందరూ తప్పనిసరిగా చదవడం, రాయడం నేర్చుకోవాలని సూచించారు. గ్రామంలో మరుగుదొడ్ల నిర్మాణం వంద శాతం పూర్తి చేయాలన్నారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా గ్రామాల్లో అనేక అభివృద్ధి పనులు జరిగాయని, రైతుల స్వచ్ఛందంగా ముందుకు వస్తే ఫార్మేషన్ రోడ్లను పూర్తి చేస్తామని తెలిపారు.
యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలి
యువత డ్రగ్స్, గంజాయి ఇతర మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని ఎస్ఐ జలంధర్రెడ్డి సూచించారు. గ్రామాల్లో బెల్ట్ షాపులను తొలగించి, సంపూర్ణ మద్యపాన నిషేధానికి సహకరించాలని కోరారు. అందుకు ముఖ్యంగా మహిళలే చొరువ తీసుకోవాలని పిలుపునిచ్చారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెంట్ ధరించాలని కోరారు. ఎవరైనా సైబర్ క్రైం బారిన పడితే వెంటనే 1930 నంబర్కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు. కార్యక్రమంలో గ్రామస్తులు, మహిళా సంఘాల సభ్యులు, యువకులు పాల్గొన్నారు.


