పటేల్ జీవితం.. అందరికీ ఆదర్శం
వనపర్తి: సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం.. ప్రతి ఒక్కరికీ ఆదర్శమని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. జాతీయ ఐక్యత దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం అనంతరం ఎన్నో రాచరిక రాష్ట్రాలను భారతదేశంలో విలీనం చేసి ఐక్య భారతంగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. దేశ ఐక్యత అంటే కేవలం భూ భాగాల కలయిక కాదని.. మనసులు, ఆలోచనలు, చర్యలు ఒకే దిశగా సాగడం కూడా ఐక్యతేనన్నారు. ప్రజల్లో శాంతి, భద్రత, పరస్పర విశ్వాసం, జాతీయ సమగ్రతను కాపాడటం పోలీసుల విధి అని.. ప్రవర్తన, సేవ, నిబద్ధతతో ప్రజల్లో పోలీసులంటే నమ్మకమనే భావనను నిలబెట్టాలని కోరారు. పటేల్ చూపిన మార్గంలో నడిస్తే దేశం మరింత బలపడుతుందని తెలిపారు. అనంతరం పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేతలకు ఎస్పీ ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు.


