
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు
వనపర్తి: వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా వైద్యశాఖ అధికారులతో సీజనల్ వ్యాధులు, క్షయ నిర్మూలన, ఏఎన్సీ నమోదు, పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచడంపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దోమలు వ్యాప్తిచెంది డెంగీ, మలేరియా, చికున్గున్యా వంటి వ్యాధులతో పాటు డయేరియా కేసులు పెరిగే అవకాశం ఉందని.. అరికట్టాలని సూచించారు. గతేడాది డెంగీ, మలేరియా, చికున్గున్యా కేసులు నమోదైన ప్రాంతాలను గుర్తించి ముందస్తు నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. ఫ్రైడే డ్రైడే పకడ్బందీగా నిర్వహించడమే కాకుండా దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, పాము, కుక్క కాటుకు చికిత్సలు అందించేలా మందులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు. దగ్గు, జ్వరం లక్షణాలున్న ప్రతి ఒక్కరికి నాట్ పరీక్షలు నిర్వహించాలన్నారు. ఇప్పటికే గుర్తించిన 567 మంది వ్యాధిగ్రస్తులు క్రమం తప్పకుండా మందులు వేసుకునేలా చూడాలని కోరారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏఎన్సీ నమోదులు సకాలంలో జరిగేలా చూడాలని ఆదేశించారు. పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలని.. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటుచేసిన కంటి శస్త్ర చికిత్స కేంద్రాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకునేలా చూడాలన్నారు. సమావేశంలో జిల్లా వైద్యాధికారి డా. శ్రీనివాసులు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్, ప్రభుత్వ వైద్యశాల సూపరింటెండెంట్ డా. రంగారావు, ప్రోగ్రాం అధికారులు డా. సాయినాథ్రెడ్డి డా. పరిమళ, సీహెచ్సీ నుంచి డా. చైతన్య, వైద్యాధికారులు పాల్గొన్నారు.
స్యామ్, మ్యామ్ పిల్లల ఆరోగ్యం మెరుగుపడాలి
జిల్లాలోని స్యామ్, మ్యామ్ పిల్లలను ఎన్ఆర్సీకి తీసుకెళ్లి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాలని కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమశాఖ అధికారులు, సీడీపీఓలు, సూపర్వైజర్లతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఎత్తుకు తగ్గ బరువు.. వయసుకు తగ్గ ఎత్తు లేని చిన్నారులు 441 మంది ఉన్నట్లు గుర్తించామని, వారందరిని అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు ఎన్ఆర్సీ కేంద్రానికి తీసుకెళ్లి వారం పాటు వైద్యం చేయించాలన్నారు. అదేవిధంగా బాల్య వివాహాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని.. ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతినెల మొదటి మంగళవారం గ్రామాల్లో విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ద్వారా సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. ఇందులో పంచాయతీ కార్యదర్శులను భాగస్వాముల ను చేయాలన్నారు. అంగన్వాడీల్లో ఐదేళ్లు నిండిన ప్ర తి విద్యార్థిని ప్రాథమిక పాఠశాలలో.. 10వ తరగతి ఉత్తీర్ణులైన బాలికలను జూనియర్ కళాశాలలో చేర్పించాలని సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి సుధారాణి, జిల్లా విద్యాధికారి మహ్మద్ అబ్దుల్ ఘనీ పాల్గొన్నారు.
మాట్లాడుతున్న
కలెక్టర్ ఆదర్శ్ సురభి