
డ్రగ్స్ మహమ్మారిని నిర్మూలిద్దాం : ఎస్పీ
వనపర్తి: విద్యార్థులు, యువత దృష్టి జీవిత లక్ష్యంపై మాత్రమే ఉండాలని.. నిషేధిత గంజాయి, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకు ఆకర్షితులు కావొద్దని ఎస్పీ రావుల గిరిధర్ అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వినియోగం, అక్రమ రవాణా వ్యతిరేక వారోత్సవాల్లో భాగంగా జేఎస్ రాములు స్వచ్ఛంద సేవాసంస్థ ఆధ్వర్యంలో రూపొందించిన వాల్పోస్టర్ను బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గంజాయి, డ్రగ్స్ వినియోగంతో ఆరోగ్యం దెబ్బతింటుందని.. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని సూచించారు. గంజాయి రహిత జిల్లా ఏర్పాటే లక్ష్యంగా పోలీసుశాఖ పని చేస్తోందని.. అందులో భాగంగా విద్యాసంస్థలు, గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు వివరించారు. మత్తు పదార్థాలను అరికట్టేందుకు యువత, విద్యార్థులు యాంటీ డ్రగ్స్ కమిటీలో సభ్యులుగా చేరి తమ వంతు పాత్ర పోషించాలని సూచించారు. యువత తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు వారి ప్రవర్తనను గమనిస్తూ చెడు అలవాట్లకు బానిసలు కాకుండా గమనిస్తూ ఉండాలన్నారు. మీ ప్రాంతాల్లో ఎక్కడైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలు విక్రయిస్తున్నట్లు, వినియోగిస్తున్నట్లు తెలిస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అనంతరం వాల్పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీసీఆర్బీ డీఎస్పీ, ఇన్చార్జ్ అదనపు ఎస్పీ ఉమామహేశ్వరరావు, రిజర్వ్ సీఐ అప్పలనాయుడు, ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, నిర్వాహకులు జె.సతీష్రాజు, మహిమరాజు, సంతోష్రాజు, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.
పోక్సో బాధితురాలికి ఆర్థిక సాయం..
జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం ఎస్పీ రావుల గిరిధర్ పోక్సో కేసు బాధితురాలి కుట్టు శిక్షణకుగాను తక్షణ సాయంగా రూ.10 వేల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోక్సో, అత్యాచార బాధితులకు భరోసా కేంద్రం అన్నివిధాలుగా అండగా నిలుస్తోందని, సిబ్బంది బాధితుల ఇళ్లను సందర్శించి వారి ఆర్థిక పరిస్థితిని గుర్తించి బాధిత సహాయ నిధి నుంచి రూ.10 వేల వరకు తక్షణ పరిహారం అందిస్తున్నట్లు వివరించారు. భరోసా కేంద్రం అందిస్తున్న ఆర్థిక సాయాన్ని బాధిత మహిళలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఏహెచ్టీయూ ఎస్ఐ అంజద్, భరోసా కేంద్రం కో–ఆర్డినేటర్, శిరీష పాల్గొన్నారు.