
రైతులతో డబ్బులు వసూలు చేయొద్దు
గోపాల్పేట: వరి కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు, లారీడ్రైవర్లు రైతుల నుంచి డబ్బులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. శనివారం ఆయన గొల్లపల్లి, చీర్కపల్లి, చాకల్పల్లి, రేవల్లి, గోపాల్పేటలోని కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కొనుగోలు చేసిన ధాన్యం వెంటనే మిల్లులకు తరలించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున రైతులు అప్రమత్తంగా ఉండి ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకు విక్రయించుకోవాలని.. కేంద్రాల్లో ఇబ్బందులకు గురిచేస్తే వెంటనే తన దృష్టికి తీసుకురావాలని కోరారు.