
సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించాలి
వీపనగండ్ల: సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత వైద్యసిబ్బందిపై ఉందని జిల్లా నోడల్ అధికారి డా. వంశీకృష్ణ అన్నారు. బుధవారం మండలంలోని కల్వరాల సబ్సెంటర్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ముసురు వర్షాలతో అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని.. ముందస్తు చర్యల్లో భాగంగా గ్రామాల్లోని వీధులను శుభ్రం చేయించి బ్లీచింగ్ పౌడర్ చల్లించాలని, మురుగు కాల్వల్లో నీరు నిల్వకుండా చూడాలన్నారు. చిన్నారులను ఆస్పత్రులకు తీసుకొచ్చి క్రమం తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని, ప్రతి శుక్రవారం డ్రై డేను పాటించాలని వైద్యసిబ్బందిని ఆదేశించారు.