
సైన్యానికి మద్దతుగా తిరంగా ర్యాలీ
వనపర్తిటౌన్: ఆపరేషన్ సిందూర్తో భారతదేశ రక్షణ వ్యవస్థ బలాన్ని ప్రపంచానికి గట్టిగా చాటి చెప్పామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు డి.నారాయణ అన్నారు. పహల్గాంలో ఉగ్రవాదులు జరిపిన మారణకాండకు ప్రతీకారంగా భారత రక్షణ దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయం, సైనికులకు మద్దతుగా ఆదివారం సాయంత్రం జిల్లాకేంద్రంలోని ప్రధాన కూడళ్ల మీదుగా పార్టీ జిల్లా కన్వీనర్ పెద్దిరాజు ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇస్లామిక్ టెరర్రిస్ట్ గ్రూప్లు కుట్ర పూరితంగా పహల్గాంలో 28 మందిని అతికిరాతకంగా చంపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్రమోదీ ఆపరేషన్ సిందూర్ పేరుతో ఈ నెల 7న ఉదయం కేవలం 20 నిమిషాల వ్యవధిలో పౌర సమాజానికి విఘాతం కలగకుండా 9 ఉగ్ర స్థావరాలను పూర్తిగా నేలమట్టం చేసి వందలాది మంది టెరర్రిస్టులను అంతమొందించి దేశ రక్షణ వ్యవస్థ శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేశారని హర్షం వ్యక్తం చేశారు. పార్టీలకతీతంగా విద్యార్థి, యువజన, కుల, ప్రజాసంఘాలు, రిటైర్డ్ ఆర్మీ జవాన్లు పెద్దసంఖ్యలో తిరంగా ర్యాలీలో పాల్గొని దేశ జవాన్లకు నేను సైతం మద్దతు అంటూ ఐక్యతను చాటారని ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు సబిరెడ్డి వెంకట్రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ లోక్నాథ్రెడ్డి, నాయకులు పురుషోత్తంరెడ్డి, బి.శ్రీశైలం, చిత్తారి ప్రభాకర్, హేమారెడ్డి, రిటైర్డ్ ఆర్మీ జవాన్ల సంఘం ప్రతినిధులు వెంకటేశ్వర్రెడ్డి, రత్నాకర్రెడ్డి, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.