
బాలల హక్కుల పరిరక్షణకు కృషి
వనపర్తి: బాలల హక్కుల పరిరక్షణకు కమిషన్ నిరంతరం కృషి చేస్తోందని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్పర్సన్ సీతాదయాకర్రెడ్డి తెలిపారు. ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ రావుల గిరిధర్తో ఆమెతో పాటు కమిషన్ సభ్యురాలు బండి అపర్ణ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. చిన్నారులకు ఆరోగ్యం, సురక్షితమైన వాతావరణం, విద్య అందించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. బాలల హక్కులను రక్షించడంతో పాటు గౌరవించాలని, వాటిని కాపాడే అధికారం కమిషన్కు ఉంటుందని వివరించారు. జిల్లాల్లో బాలలకు అందుతున్న విద్య, పోక్సో చట్టం అమలు, బాధితులకు అందుతున్న పరిహారం తదితర విషయాలను సభ్యురాలు బండి అపర్ణను అడిగి తెలుసుకున్నారు. బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాలని, బాల్య వివాహాలు జరగకుండా చూడాలని, చిన్నారులు మానసిక రుగ్మతలకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాలల హక్కులను కాలరాస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థినులు, యువతులు, మహిళల భద్రత పోలీసుశాఖ మొదటి ప్రాధాన్యమని, భద్రతకు సంబంధించి ఏ సమస్య ఉన్నా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని కోరారు. బాలల సంరక్షణకు జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.