
పకడ్బందీగా స్క్రీనింగ్ పరీక్ష
వనపర్తి: జిల్లాకేంద్రంలో మే 25న జరిగే గ్రామ పరిపాలన అధికారుల స్క్రీనింగ్ పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జి.వెంకటేశ్వర్లు ఆదేశించారు. గత ప్రభుత్వం వివిధ శాఖల్లో నియామకం చేసిన వీఆర్వోలు, డిగ్రీ ఉత్తీర్ణులైన వీఆర్ఏలను ప్రస్తుత ప్రభుత్వం గ్రామ పరిపాలన అధికారులుగా నియమించనుంది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఆసక్తిగల 97 మంది వీఆర్వోలు, వీఆర్ఏలు దరఖాస్తు చేసుకోగా వారికి మే 25న ఆదివారం రాత పరీక్ష జరగనుంది. ఈ సందర్భంగా శుక్రవారం కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకేంద్రంలోని జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు జరిగే పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. కేంద్రంలో అన్ని మౌలిక వసతులు కల్పించాలని, విద్యుత్ సదుపాయం ఉండాలన్నారు. కేంద్రాల్లోకి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకెళ్లడానికి వీలులేదని.. అభ్యర్థులను ఉదయం 9.30 నుంచి 10 వరకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. పోలీసుశాఖ తగిన బందోబస్తు కల్పించాలని సూచించారు. సమావేశంలో డీసీఆర్బీ డీఎస్పీ ఉమామహేశ్వరరావు, ఏఓ భానుప్రకాశ్, తహసీల్దార్ రమేష్రెడ్డి, పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్, పుర అధికారులు పాల్గొన్నారు.