
రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు
కొత్తకోట రూరల్: వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా.. కనీస మౌలిక వసతులు కల్పించాలని అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం పెద్దమందడి మండలంలోని అల్వాల, జగత్పల్లి, చిన్నమందడి, పెద్దమందడి, మనిగిళ్ల గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తెచ్చిన రైతులు సేదతీరేందుకు టెంట్, మంచినీరు వంటి కనీస సౌకర్యాలు కల్పించాలని, లేకపోతే సెంటర్ను మూసివేస్తామని హెచ్చరించారు. రైతులు ఇబ్బందులు పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత కొనుగోలు కేంద్రాల నిర్వాహకులదేనని స్పష్టం చేశారు. అలాగే తేమ వచ్చిన వెంటనే కొనుగోలు చేసి ధాన్యాన్ని గోదాంలకు తరలించాలని ట్రాన్స్ఫోర్ట్ కాంట్రాక్టర్లను ఆదేశించారు. లారీలు పెట్టడంలో ఆలస్యం చేయవద్దని, అలా చేస్తే బరువు తగ్గి రైతులు నష్టపోతారన్నారు. అనంతరం వెల్టూరు, మదనాపూర్ గోదాంలు పరిశీలించారు.

రైతులకు ఇబ్బందులు కలిగించొద్దు