
తడిసిన ధాన్యం ప్రభుత్వమే కొనుగోలు చేయాలి
కొత్తకోట రూరల్: ఇటీవల కురిసిన అకాల వర్షాలకు వరి ధాన్యం తడిసి తేమశాతం పెరగడంతో కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారని.. ప్రభుత్వం స్పందించి వెంటనే కొనుగోళ్లు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎండీ జబ్బార్ డిమాండ్ చేశారు. బుధవారం మండలంలోని కనిమెట్ట శివారులో తడిసిన ధాన్యాన్ని తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జబ్బార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ఓ వైపు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెబుతున్నా క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యంతో కేంద్రాల నిర్వాహకులు కొనుగోలు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. దొడ్డురకం ధాన్యానికి బోనస్ ప్రకటించాలని, కేంద్రాల్లో రైతులకు కనీస సౌకర్యాలు, మంచినీటి సౌకర్యం కల్పించాలన్నారు. చాలామంది రైతులకు రైతు భరోసా రాలేదని, త్వరగా మంజూరు చేయాలని కోరారు. అకాల వర్షాలతో మామిడి తదితర పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయని, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి రైతులకు నష్ట పరిహారం అందించాలన్నారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు బాల్రెడ్డి, సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు నిక్సన్, చిరంజీవి, రైతులు వెంకటమ్మ, బాలమ్మ, సుశీల, సరోజ తదితరులు పాల్గొన్నారు.
రైతు సంఘం రాష్ట్ర నాయకుడుఎండీ జబ్బార్