● రైతుల గోడు పట్టని చంద్రబాబు
● కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు
చేయకపోవడంపై ఆగ్రహం
● 45,590 హెక్టార్లలో సాగైన మొక్కజొన్న
మెరకముడిదాం: ఆరుగాలాలు పాటూ శ్రమించి, చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చింది. ఇక అమ్ముకుందామనేసరికి ధర తగ్గిపోతే ఆ రైతులు ఆవేదన వర్ణానాతీతంగా వుంటుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలో మొక్కజొన్న పంట పెరుగుతూ వస్తుంది. ఇందులో భాగంగానే ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా మొక్కజొన్న పంట 45,590 హెక్టార్లలో రైతులు సాగు చేశారు. ఇప్పుడు ఈ పంట రైతులు చేతికి వస్తుంది. ఎన్నో అవరోధాలను దాటుకొని పంటను సాగు చేసిన రైతులు తమ పంటకు మంచి ధర పలుకుతుందన్న ఆశలు అడియాశలుగానే మిగిలాయి. కేంద్ర ప్రభుత్వం మొక్కజొన్న పంటకు క్వింటాకు రూ.2,400 లను మద్దతు ధరగా ప్రకటించింది. మద్దతు ధర బాగానే వుందని తమ పంటను అమ్మకుందామని ఆశపడ్డ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం చుక్కలు చూపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే మొక్కజొన్న కేంద్రాలను ఏర్పాటు చేయాల్సి వుండగా ఇంతవరకూ జిల్లా వ్యాప్తంగా ఒక్కమొక్కజొన్న కేంద్రాన్ని కూడా చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. దీంతో కేంద్రం ప్రకటించిన మద్దతు ధర తమకు ఇప్పట్లో దక్కేటట్టు లేకపోవడంతో పాటూ వాతావరణంలో మార్పులు రావడంతో ఏ సమయంలో వర్షం కురిస్తే కష్టపడి పండించిన పంట మొత్తం వర్షార్పణం అవుతుందేమోనని రైతులు ఆవేదన చెందుతున్నారు. దీంతో కొందరు రైతులు దళారులకు క్వింటా 17 వందల నుంచి 18 వందలలోపు అమ్మకాలు జరుపుతున్నారు. దీంతో క్వింటాకు రూ.600ల వరకూ నష్టాన్ని చవిచూడాల్సి వస్తుందని రైతులు గగ్గోలు పెడుతున్నారు. హెక్టారుకు సుమారు 44 వేల రూపాయలు వరకూ నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 3లక్షల 37 వేల మెట్రిక్ టన్నులు మొక్కజొన్న పండుతుందంటే రూ.లక్షల్లో రైతులు నష్టాలను భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం మొక్కజొన్న కేంద్రాలను త్వరితగతిన ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు.
ప్రభుత్వానికి నివేదించాం..
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడంపై ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే జిల్లా వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తాం.
– రామారావు, వ్యవసాయ శాఖ జేడీ, విజయనగరం
చిన్నచూపు సరికాదు..
రైతులపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూడడం సరికాదు. మొక్కజొన్న కొనుగోలుకు ఒక్క కేంద్రం కూడా ఏర్పాటు చేయకపోవడం ఎంత వరకు సమంజసం. రైతులు ఎలా విక్రయిస్తారు. ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. దిక్కుతోచని పరిస్థితిలో రైతులు క్వింటా మొక్కజొన్నను రూ.1700లకు విక్రయిస్తున్నారు. దీంతో రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి క్వింటా రూ.2400లకు కొనుగోలు చేయాలి.
– శిరువూరు సీతారామరాజు, ఎంపీటీసీ, సోమలింగాపురం


