పూసపాటిరేగ : మండల కేంద్రమైన పూసపాటిరేగలో హెచ్పీ గ్యాస్ బుకింగ్లో ఏజెన్సీ అవకతవకలకు పాల్పడుతున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లిమర్ల గాయిత్రి గ్యాస్ ఏజెన్సీ పేరిట గ్యాస్ బుకింగ్ చేసుకున్న లబ్ధిదారులకు గ్యాస్ బుకింగ్ తేదీతో పాటు ఓటీపీ వచ్చినా గ్యాస్ సరఫరా చేయడం లేదు. వినియోగదారులు నంబరుతో గ్యాస్ బుక్ చేసిన తరువాత ఓటీపీ వచ్చి గ్యాస్ బుక్ అయినట్లు వినియోగదారులకు మేసేజ్ వచ్చినప్పటికీ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు వినియోగదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పూసపాటిరేగ మండల పరిధిలో వందల సంఖ్యలో వినియోగదారులు గ్యాస్ బుక్ చేసినప్పటికి గ్యాస్ సరఫరా కాకపోవడంతో పలు అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. గ్యాస్ బుకింగ్ చేసిన వినియోగదారులకు సరఫరా ఎగ్గొట్టి గ్యాస్ పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నెల్లిమర్ల గాయిత్రి గ్యాస్ ఏజెన్సీ పరిధిలో సుమారు 50 వేల కనెక్షన్లు వున్నాయి. వాటి పరిధిలో పూసపాటిరేగ, డెంకాడ, నెల్లిమర్ల మండలాలు వున్నాయి. జిల్లాలోనే అత్యధికంగా గ్యాస్ కనెక్షన్లు ఇక్కడ వున్నప్పటికి సరఫరా సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు వున్నాయి. పూసపాటిరేగకు చెందిన కోరాడ రమా వినియోగదారుని నంబరు 651205 కు ఈ నెల 24వ తేదీన గ్యాస్ బుక్ చేశారు. బుక్ అయినట్టు ఓటీపీ 6375 అనే నంబరు మెసేజి వచ్చింది. ఇదే మాదిరిగా పూసపాటిరేగ కారిపివాని కల్లాలకు చెందిన కారిపి లక్ష్మినాయుడు వినియోగదారుని నంబరు 627181 అనే నెంబరు ద్వారా ఈ నెల 24న గ్యాస్ బుక్ చేశారు. ఓటీపీ 1584గా వచ్చింది. నక్కానపేటకు చెందిన కోండ్రు రాములమ్మ వినియోగదారుని నంబరు 647878 ద్వారా బుక్ చేయగా ఓటీపీ 9358గా వచ్చింది. అయితే ఇంతవరకు బాగానే వున్నా బుకింగ్ చేసుకున్న గ్యాస్ వినియోగదారుడు గ్యాస్ కార్యాలయానికి వెళ్లగా బుకింగ్ కాలేదని నిర్వాహకులు బదులు ఇవ్వడంతో నిరాశతో వెనుదిరుగుతున్న పరిస్థితి. ఇదే మాదిరి వందల సంఖ్యలో లబ్ధిదారులు గ్యాస్ బుక్ చేసుకున్నా బుక్ కాలేదని గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు చెప్పడంతో తప్పని పరిస్థితిలో ఉసురుమంటూ వెనుదిరగాల్సిన పరిస్థితి నెలకొంది. సదరు గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ స్టాక్ పూసపాటిరేగలో ఓ ప్రభుత్వ స్థలంలో లారీలు నిలుపుదల చేసి విక్రయాలు చేయడంతో పలు అనుమానాలను వినియోగదారులు వ్యక్తం చేస్తున్నారు. అనుమతి లేని చోట గ్యాస్ వుంచి విక్రయాలు చేయడంతో ఎటువంటి ప్రమాదాలు జరిగినా ఎవరు బాధ్యులు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. అసలు గ్యాస్ స్టాక్ పాయింట్ ఎక్కడ అనే విషయమై అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు. దీనిపై జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి మురళినాధ్ వద్ద సాక్షి ప్రస్తావించగా దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తాం అన్నారు. గ్యాస్ బుక్ అయినట్లయితే గ్యాస్ సరఫరా జరుగుతుందని చెప్పారు.
గ్యాస్ బుక్ చేసినా కాలేదని బదులిస్తున్న నిర్వాహకులు
నిరాశతో వెనుదిరుగుతున్న
వినియోగదారులు
గ్యాస్ పంపిణీలో అక్రమాలు
జరుగుతున్నాయని నిర్వాహకులు


