
లోహ జగత్తు పుస్తకావిష్కరణ
విజయనగరం టౌన్: మానవ శరీరం అనేక లోహమూలకాల సమూహం. ఆయా లోహాలు శరీరం ఎదుగుదల, క్షీణతలపై ఏ విధంగా ప్రభావితం చేస్తాయి ‘లోహ జగత్తు’ పుస్తకంలో సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో వివరించినట్లు ప్రముఖ రచయిత్రి చాగంటి తులసి పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక అయ్యన్నపేట పాల్నగర్లో ఉన్న చాగంటి తులసి స్వగృహంలో తన సోదరి చాగంటి కృష్ణకుమారి రచించిన లోహ జగత్తు పుస్తకావిష్కరణ ఆదివారం చేశారు. ఈ సందర్భంగా ప్రముఖ రచయిత సుమనస్పతి రెడ్డి మాట్లాడుతూ తెలుగులో సరళమైన భాషలో లోహ జగత్తు పుస్తకం కథాకథనంలో ప్రజలకు అందుబాటులో రావడం వల్ల విదార్థులకు విషయ పరిజ్ఞానం సముపార్జనకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జనవిజ్ఞానవేదిక రాష్ట్ర నాయకుడు ఎంవీఆర్.కృష్ణాజీ మాట్లాడుతూ ప్రపంచ నాగరికత వెనుక లోహ మూలకాలు, మనిషి జీవితంలో లోహాల వినియోగం సైన్స్ అభివృద్ధి సమాజంపై ప్రభావం చూపిందన్నారు. లోహ జగత్తు పుస్తకం కథా కథనం వెలువరించడం వెనుక తన తండ్రి చా.సోకు ఆమె ఇచ్చిన మాట ఉందన్నారు. జీవనంలో లోహాలు, నానోటెక్నాలజీ ఎలా ఉపయోగిస్తున్నారు? సైన్స్ అంటే భయాలు లేకుండా పోతాయని వివరించారు. లోహ జగత్తు పుస్తకం కథాకథనానికి అనుగుణంగా చిత్రాలు వేయడంతో లోహాల ప్రయోజనం తెలుసుకోవడం సులభతరమైందని చిత్రకారిణి కె.మధురశ్రీ అన్నారు. కార్యక్రమంలో ఎంఆర్. మహిళా కళాశాల విశ్రాంత ప్రిన్సిపాల్ లలితకుమారి, చిత్రకారుడు చా.సో కుమారుడు చాగంటి బాపిరాజు, చాసో అభిమానులు, వర్ధమాన రచయితలు, సాహితీ స్రవంతి నిర్వాహకుడు చీకటిదివాకర్ తదితరులు పాల్గొన్నారు.