
‘ఉగ్ర’ విచారణలో విస్తుపోయే నిజాలు!
● మూడో రోజూ కొనసాగిన విచారణ
విజయనగరం క్రైమ్: బాంబు పేలుళ్ల కుట్ర కేసులో విజయనగరం పోలీసుల కస్టడీలో ఉన్న సిరాజ్, సమీర్లను మూడో రోజు ఆదివారం కూడా విచారించారు. ఇందులో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చినట్టు భోగట్టా. కోర్టు ఆదేశాలతో ఎన్ఐఏ అధికారుల నుంచి తమ కస్టడీలోకి తీసుకున్న విజయనగరం పోలీసులు స్థానిక పీటీసీలో మూడో రోజు కూడా విచారణ కొనసాగించారు. రెండో రోజు శనివారం రాత్రి సిరాజ్ కాస్త అస్వస్తతకు గురవడంతో సర్వజన ఆసుపత్రి నుంచి ఇద్దరు ప్రత్యేక వైద్యాధికారులను రప్పించి పీటీసీలోనే చికిత్స చేయించినట్టు సమాచారం. తొలి రెండు రోజులు కాస్త నెమ్మదిగా దర్యాప్తు సాగించిన దర్యాప్తు బృందం అధికారులు మూడో రోజు తమదైన కోణంలో విచారణ సాగించినట్టు తెలిసింది. ముఖ్యంగా గడిచిన ఆరు నెలలుగా హైదరాబాద్లోనే సమీర్తో ఉన్న విజయనగరం వాసి సిరాజ్ అక్కడే బాంబు పేలుళ్లకు పన్నాగం పన్నినట్టు విచారణలో తేలినట్టు తెలిసింది. మానవ బాంబుగా సిద్ధమైన సిరాజ్, సమీర్లు ముస్లిమేతరులే లక్ష్యంగా సోషల్ మీడియా వేదికగా పేలుళ్లకు పథక రచన చేసినట్టు తెలిసింది. వరంగల్ ఫర్హాన్, ఢిల్లీ బాదర్ నుంచి వీరికి ఉన్న సంబంధాలపై కూపీ లాగుతున్నట్టు సమాచారం. మూడో రోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విచారణ సాగినట్టు భోగట్టా. తిరిగి సాయంత్రం 5.30 గంటలకు మొదలైన విచారణ రాత్రి వరకు కొనసాగినట్టు తెలిసింది.