
విస్తుపోయే కోణాలు
ఉగ్ర కుట్రలో
డీసీసీబీలో బ్యాంకు ఖాతా.. పెద్ద ఎత్తున నగదు
విజయనగరంలోని డీసీసీబీ బ్యాంకులో సిరాజ్ పేరిట బ్యాంకు ఖాతా ఉన్నట్లు తెలిసింది. ఇందులో రూ.45 లక్షలకుపైగా ఉన్నట్లు సమాచారం. ఇది ఒక ఖాతాలోనే ఉన్నట్లు తెలుస్తోంది. రూ.22 లక్షల వరకు ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయని భావిస్తున్నారు. మిగిలిన కుటుంబ సభ్యులకు కూడా ఇదే బ్యాంకులో ఖాతాలతోపాటు.. లాకర్లు కూడా ఉన్నాయని తెలుస్తోంది. మిగిలిన బ్యాంకుల్లో కుటుంబ సభ్యుల పేరిట ఏమైనా ఖాతాలు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం అందరి ఖాతాల్లో రూ.70 లక్షలకుపైగా ఉండొచ్చని భావిస్తున్నారు. సిరాజ్ వ్యవహారం జరుగుతుండగానే.. తండ్రి రహమాన్ నగరంలోని డీసీసీబీ బ్యాంకుకు వెళ్లారు. లాకర్లు తెరిచేందుకు ప్రయత్నించినట్లు తెలిసింది. అప్పటికే రెండో పట్టణ పోలీసుల ముందస్తు సూచనతో బ్యాంకు అధికారులు అప్రమత్తమై తెరిచేందుకు వీలులేదని చెప్పినట్లు సమాచారం. సిరాజ్ సెల్ఫోన్, ట్యాబ్లను ఎన్ఐఏ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. మొత్తం ఖాతాలను ఫ్రీజ్ చేశారు.
విజయనగరం క్రైమ్:
ఉగ్రవాది మూలాలున్న సిరాజ్ కేసులో తవ్వేకొద్దీ విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు.. అన్ని కోణాల్లోనూ విచారణ చేపడుతున్నారు. ఈ క్రమంలోనే ఎఫ్ఐఆర్ కాపీ బయటకు రావడం.. అందులోని అంశాలు, నిందితుడు సిరాజ్ ఇచ్చిన వాంగ్మూలం సంచలనంగా మారింది.
అవసరమైతే ఆత్మాహుతికి అయినా సిద్ధమే..
ఆబాద్ వీధికి చెందిన సిరాజ్ బీటెక్లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కొత్తవలస వద్ద కంటకాపల్లిలోని శారద కంపెనీలో కొన్నాళ్లు పనిచేశాడు. తర్వాత హైదరాబాద్లో ఉంటూ, ఎస్సై ఎంపికల కోసం రెండుసార్లు ప్రయత్నం చేశాడు. గ్రూప్–2 శిక్షణ కూడా తీసుకున్నాడు. ఆ ప్రయత్నాలేవీ సఫలం కాలేదు. హైదరాబాద్లో ఉంటుండగానే.. సమీర్, వరంగల్కు చెందిన ఫర్వాన్ మొహిద్దీన్, ఉత్తరప్రదేశ్కు చెందిన బదర్తో పరిచయం ఏర్పడింది. ఖిలావత్, జిహాదీ విషయాలపై తరచూ చర్చించుకునే వారని సమాచారం. ముస్లింలు అన్యాయానికి గురవుతున్నారన్న భావనకు వచ్చారు. ముిస్లిమేతరులు.. ముస్లిం మహిళలను ప్రేమించి పెళ్లి చేసుకోకుండా మోసగిస్తున్నారని భావించారు. అటువంటి మోసాల నుంచి తమ మహిళలను రక్షించుకునేందుకు ‘ఏహెచ్ఐఎం’ అనే పేరుతో గ్రూపులు దేశవ్యాప్తంగా ఏర్పాటు చేసి, యువతను మతోన్మాదంవైపు ప్రేరేపించారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పర్యటించారు. ఈ క్రమంలోనే మరికొంతమందితో పరిచయం ఏర్పడింది. సౌదీలో ఉంటున్న బీహార్కు చెందిన అబు ముసబ్ అనే వ్యక్తి సూచనలను అమలు చేయడం ప్రారంభించారు. ముస్లింయేతరులపై దాడులకు తక్కువ ఖర్చుతో రసాయన పదార్థాలు ఉపయోగించి ఐఈడీలు తయారు చేయాలని నిర్ణయించుకున్నారు. ఒమన్లో ఉంటున్న హైదరాబాద్కు చెందిన ఇమ్రాన్ అక్రం అనే వ్యక్తి ఎక్స్ప్లోజివ్స్ తయారీకి రూ.3 వేలు పంపాడు. ఆన్లైన్ సైట్లలో కొంత.. మరికొంత పేలుడు పదార్థాలను విజయనగరంలోని పలు దుకాణాల వద్ద కొనుగోలు చేశాడు. మొత్తం కలిపి, ఐఈడీ తయారు చేసి విజయనగరంలోనే జన సంచారం ఉన్న ప్రాంతంలో పేలుళ్లకు పథక రచన చేశాడు. ఈ క్రమంలోనే ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. పోలీసులు పట్టుకున్నారు. నగరంలోని మూడులాంతర్లు, వనంగుడి పైడితల్లి అమ్మవారి ఆలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, దాసన్నపేట రింగురోడ్డు ప్రాంతాల్లో బాంబు బ్లాస్ట్లకు పథక రచన చేసినట్లు తెలుస్తోంది. తద్వారా నగర ప్రజలు.. ప్రధానంగా ముస్లిమేతరుల్లో భయాందోళనలు సృష్టించే ప్రణాళికగా సమాచారం. బాంబుల తయారీపై ఆన్లైన్లో తరచూ వెదకడం.. ఇంటిలిజెన్స్ దృష్టిలో పడింది. జిహాదీ చర్యల్లో భాగంగా అవసరమైతే ప్రాణత్యాగానికి అయినా సిద్ధపడాలని సిరాజ్ నిర్ణయించుకోవడం గమనార్హం.
ముస్లిం యేతరులే టార్గెట్..
విజయనగరం ఆబాద్వీధికి చెందిన సిరాజ్ ఉర్ రెహ్మాన్పై బాంబు ఎక్స్ప్లోజివ్స్ 113(1), 147, 148, 149, 152, బీఎఎస్ యాక్ట్ కింద పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు ఎఫ్ఐఆర్లో బాంబు పేలుళ్ల ప్రణాళికలకు సంబంధించి, ముస్లిమేతరులపై సిరాజ్కు ఉన్న ద్వేషం తదితర అంశాలపై స్వయంగా వెల్లడించిన అంశాలను ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. సిరాజ్ బృందం ప్రధానంగా ఆర్ఎస్ఎస్ నేతలు, కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిరాజ్, సమీర్లు సిగ్నల్ యాప్ ద్వారా చేసుకున్న చాటింగ్ బయటకు వచ్చింది. పేలుడు పదార్థాల ల్యాబ్ ఏర్పాటుపై చర్చించుకున్నారు. రాకెట్ లాంచర్ల తయారీనీ తెలుసుకున్నారు. మసీదులు, ముస్లింల ఇళ్లపైకి జేసీబీలు వస్తే రాకెట్ లాంచర్లతో పేల్చేద్దామని ప్రణాళిక వేసుకున్నారు. తమకు డబ్బులు వస్తే ఇలాంటి స్కూల్ పెట్టాలన్న కోరిక ఉన్నట్లు చాటింగ్ ద్వారా చర్చించుకున్నారు.
సిరాజ్ కేసులో తవ్వేకొద్దీ వెలుగులోకి కొత్త అంశాలు
ఆత్మాహుతికై నా సిద్ధం..
విజయనగరంలోని డీసీసీబీలో
బ్యాంకు ఖాతా
పెద్ద ఎత్తున నగదు.. ఫ్రీజ్ చేసిన
అధికారులు
విజయనగరంలోని పలుచోట్ల
పేలుళ్లకు కుట్ర