
మాదక ద్రవ్యాల జోలికి పోవద్దు... : ఎస్పీ
విజయనగరం క్రైమ్ : మాదక ద్రవ్యాల జోలికి యువత పోవద్దని బంగారం లాంటి జీవతాన్ని పాడుచేసుకోవద్దని ఎస్పీ వకుల్ జిందల్ యువతకు విజ్ఙప్తి చేశారు. కలాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ యూత్ ఎక్సలెన్స్, చేయూత ఫౌండేషన్ సొసైటీ ఆధ్వర్యంలో నగరంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. డ్రగ్స్ ఉపయోగం వలన కేరిర్ ఎలా పాడవుతుంది, మానవ జీవితాలు ఎలా నాశనం అవుతాయో అన్న దానిపై ప్రజలలో చైతన్యం తెచ్చేందుకు సంకల్పం కార్యక్రమం చేపట్టామన్నారు. యువత ఒకసారి డ్రగ్స్కు అలవాటు పడితే దాని ప్రభావం ఎంతవరకు దారి తీస్తుందో తెలియని మైకంలో పడతారన్నారు. కన్నవారి ఆశలను తెంచేవారవుతారని ఎస్పీ హితబోధ చేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ మాజీ చైర్మన్, రాష్ట్ర ప్రభుత్వ డిఫెన్స్ ఎస్టాబ్లిష్మెంట్ సలహదారు డా.సతీష్రెడ్డి మాట్లాడుతూ మన భారతదేశం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ప్రపంచ దేశాల కంటే ముందున్నదని నేటి యువతరం ఆ అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. తద్వారా భారత రక్షణ రంగాన్ని మరింత మందుకు తీసుకెళ్లే బాధ్యత యువతపైనే ఉందన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తితో 2045 నాటికి వికసిత భారత్ కలను నిజం చేయాలని కోరారు. యువ సమ్మేళంలో ఆర్డీఓ దాట్ల కీర్తి, ఎండీ కలీయుల్లా షరీఫ్, రవీంద్రరెడ్డి, చేయూత ఫౌండేషన్ అధ్యక్షుడు రాము లెండి, రఘు, సీతం కళాశాలలల ప్రొఫెసర్లు, పెద్ద సంఖ్యలో యువత పాల్గొన్నారు.