
సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి
● ఉపాధి హామీ అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ అగ్రహం
గుర్ల: జాతీయ ఉపాధి హామీ అధికారుల తీరుపై జెడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు గుర్లలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ పొట్నూరు ప్రమీల అధ్యక్షతన శుక్రవారం నిర్వహించిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన హాజరయ్యారు. గోషాడ, గరికివలసలలో ఉపాధి హమీ పనులు ఎందుకు ప్రారంభించలేదని ఏపీఓ రత్నమాలను ప్రశ్నించారు. వచ్చే వారం ఆయా గ్రామాల్లో ఉపాధి హామీ పనులు ప్రారంభిస్తామని ఆమె బదులు ఇచ్చారు. జమ్ములో ఫీల్డ్ అసిస్టెంట్కు తెలియకుండా ఉపాధి హమీ పనులు ఎలా చేపడతారని సర్పంచ్ గొర్లె నరసింహమూర్తి ప్రశ్నించారు. టీడీపీ నేతలు చెప్పినట్లు ఉపాధి పనులు చేపట్టడం సమంజసం కాదని ఏపీఓకు జెడ్పీ చైర్మన్ సూచించారు. గ్రామాల్లో ఇప్పటికే ఉన్న మేట్లను తొలగించకుండా కొత్త మేట్లను స్థానిక నేతలు సిఫార్సు చేసిన వారిని వేయాలని జెడ్పీ చైర్మన్ స్పష్టం చేశారు. ఆర్థిక ఆరోపణలు వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లను తక్షణమే తొలగించాలని ఏపీఓను ఆదేశించారు. కొండగండ్రేడులో టీడీపీ నేతలు చెప్పారని ఉపాధి హామీ పనులను ప్రారంభించలేదని సర్పంచ్ సారిక గోవింద్ జెడ్పీ చైర్మన్ దృష్టికి తీసుకువచ్చారు. ఉపాధి హామీ వేతనదారులకు కనీస వేతనం రూ.307 ఉన్నప్పటికీ రోజుకు రూ.50 నుంచి రూ.100 వరకు వస్తుందని , కనీస వేతనం రూ.300లు వచ్చేలా పనులు చేపట్టేలా తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని ఉపాధి హామీ అధికారులకు జెడ్పీ చైర్మన్ సూచించారు. అధికారులు సమస్యల పరిష్కారానికి చొరవ చూపడం లేదని , గ్రామాల్లో తరచూ పర్యటించకపోవడం వల్లే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులను కలిసి సమన్వయం చేసుకుంటూ వెళ్లాలని సూచించారు. సమావేశంలో వైస్ ఎంపీపీలు అంబళ్ల లక్ష్మి, తోట తిరుపతిరావు, ఎంపీడీఓ శేషుబాబు, డీటీ నారాయణమ్మ, ఎంపీటీసీలు, సర్పంచ్లు, అధికారులు పాల్గొన్నారు.