
అదానీని అడ్డుకుందాం
● ఏపీ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్
వేపాడ: మండలంలోని కరకవలస పంచాయతీ గిరిశిఖరంపై ఉన్న మారిక గిరిజన గ్రామంలో భూములను, కొండను దోచుకునేందుకు వస్తున్న ఆదానీకి చెందిన గుజరాత్ కంపెనీ మారిక రాకుండా అడ్డుకుందామని సీపీఎం నేత, ఏపీ రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు చల్లా జగన్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం మారిక గిరిజనులతో కలిసి ఆయన మాట్లాడుతూ మారిక గ్రామ రెవెన్యూలో 35 సర్వే నంబర్లు ఉన్నాయని అందులో 32 సర్వే నంబర్లలో ఉన్న భూములు, ఇళ్లు, బడి, గుడి ఆదాని కంపెనీకి చెందిన హైడ్రో పవర్ప్లాంట్కు అప్పగిస్తామని ప్రభుత్వం నోటిఫికేషన్ ఇవ్వడం అన్యాయమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదానిపై ఉన్న శ్రద్ధ గిరిజనులపై లేకపోవడం బాధాకరమన్నారు. మారిక గిరిజన గ్రామాన్ని ఆదానీ గ్రూప్కు అప్పగించడాన్ని వెనక్కి తీసుకోకపోతే జిల్లాలో ఉన్న గిరిజనులంతా ఏకమై పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఆదానీ గ్రూప్ మారికలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బాబూరావు, ఆనంద్ రామకృష్ణ, అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.