
గిట్టుబాటుకాని ఉపాధి!
‘గంట్యాడ మండలానికి చెందిన దేముడు అనే వేతనదారుడు ఏప్రిల్ నెలలో ఉపాధి హామీ పనికి వెళ్లారు. 6 రోజుల పనికి అతనికి వచ్చిన వేతనం రూ.930లు. ఈ లెక్కన రోజుకి అతనికి రూ.155 చొప్పన వేతనం వచ్చింది.’
విజయనగరం ఫోర్ట్: జిల్లాలో చేపట్టిన ఉపాధిహామీ పనులు వేతనదారులకు గిట్టుబాటు కావడం లేదు. ఎండలో పనిచేస్తున్నా అరకొర వేతనమే వస్తుండడం వేతనదారులను ఆందోళనకు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన వేతనంలో సగం వేతనమైనా రాకపోవడం వేతనదారులకు ఆవేదనమిగుల్చుతోంది. జిల్లాలో 3.84లక్షలు జాబ్ కార్డులు ఉండగా, ఇందులో యాక్టివ్గా 3.53 లక్షల కార్డులు ఉన్నాయి. వీటి పరిధిలో 6.08 లక్షల మంది వేతనదారులు ఉండగా, పనులకు వెళ్తున్నవారు 5.95 లక్షల మంది. 2025–26 సంవత్సరంలో ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి పనిదినాల లక్ష్యం 1.33 కోట్లుకాగా, ఏప్రిల్ 19 నాటికి 9.21 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారు.
సగం వేతనం రావడంలేదు..
ఉపాధి హామీ పథకం వేతనదారులకు రూ.300 ఉన్న వేతనాన్ని కేంద్ర ప్రభుత్వం రూ.307కు పెంచింది. అయితే, జిల్లాలో పనిచేస్తున్న చాలామంది వేతనదారులకు రోజుకు ఇందులో సగం వేతనం కూడా రావడంలేదు. రోజువారీ వేతనం రూ.155 నుంచి రూ.180 మాత్రమే వస్తోంది. దీంతో పనికివెళ్తున్నా కుటుంబ పోషణకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు వేతనదారులకు సుమారు రూ.70 కోట్ల వేతనబకాయిలు చెల్లించకపోవడంతో కష్టాలు ఎదుర్కొంటున్నారు.
పనికి తగ్గ వేతనం
వేతనదారులు ఎంత పనిచేస్తే దానికి తగ్గ వేతనం మాత్రమే వస్తుంది. వేతనదారులకు వేతనం ఎక్కువ వచ్చేలా పని కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. వేతనదారులు 5 నుంచి 6 గంటలు పనిచేస్తే వేతనం ఎక్కువగా వస్తుంది. వేతనదారులకు వేతన బకాయిలు వారి ఖాతాల్లో జమవుతున్నాయి.
– ఎస్.శారదాదేవి, పీడీ, డ్వామా
‘గంట్యాడ మండలానికి చెందిన మణి అనే మహిళ కూడా ఏప్రిల్ నెలలో గ్రామంలో జరిగే ఉపాధి హామీ పనికి వెళ్లారు. 6 రోజుల పనికిగాను ఆమెకు కూడా రూ.930 వేతనమే వచ్చింది. ఆమెకు కూడా రోజుకి రూ.155 లెక్కన వేతనం రావడంతో గిట్టుబాటుకావడంలేదని వాపోయింది.’
సగం కూలి కూడా రావడం లేదని
వేతనదారుల ఆందోళన
రోజుకు రూ.155 నుంచి రూ.180 మాత్రమే వస్తున్న వైనం
జిల్లాలోని వేతనదారులు 5.95 లక్షలు
జిల్లాలో జాబ్ కార్డులు 3.53 లక్షలు
కేంద్రం నిర్ణయించిన వేతనం రూ.307

గిట్టుబాటుకాని ఉపాధి!