
జిందాల్ కార్మికుల ఆందోళన
కొత్తవలస: మండలంలోని అప్పన్నపాలెం గ్రామ సమీపంలోని జిందాల్ స్టెయిన్లెస్ స్టీల్ కర్మాగార యాజమాన్యం అక్రమంగా విధించిన లేఆఫ్ను ఎత్తేయాలని, కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలంటూ కర్మాగారం ఎదుట సోమవారం ఆందోళన చేశారు. నాలుగు దశాబ్దాలుగా కర్మాగారంలో పనిచేస్తూ బతుకుతున్నామని, ఉన్నఫలంగా మూసివేస్తే తమ పరిస్థితి ఏమిటంటూ కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా మూసివేయడం తగదన్నారు. ఏసీఎల్, డీసీఎల్ అధికారులు యాజమాన్యం తీరును ఖండిస్తూ వెంటనే కర్మాగారం తెరిచి కార్మికులకు పని కల్పించాలని ఆదేశించినా స్పందించకపోవడం దారుణమన్నారు. కర్మాగారం తెరిపించేందుకు కృషి చేయాలని కోరుతూ లక్కవరపుకోట మండల కేంద్రంలో ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి స్వగృహానికి వెళ్లి వినతిపత్రం అందజేశారు. కొత్తవలస తహసీల్దార్కు, విజయనగరంలోని మంత్రి కొండపల్లి శ్రీనివాస్కు తమ గోడు వినిపించారు. కార్యక్రమంలో జిందాల్ ఎంప్లాయీస్ అండ్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ప్రతినిధులు లగుడు వామాలు, పిల్లా అప్పలరాజు, ఎస్.భీమయ్య, నమ్మి చిన్నబాబు, పప్పల బంగారనాయుడు, తదితరులు పాల్గొన్నారు.