
తొలిరోజు పరీక్ష ప్రశాంతం
విజయనగరం అర్బన్/విజయనగరం: జిల్లాలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి పరీక్ష ప్రశాంతంగా జరిగింది. తొలిరోజు కావడంతో విద్యార్థులు ఇష్టదైవాలకు పూజలు చేశారు. తల్లిదండ్రులతో కలిసి పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకున్నారు. హాల్టికెట్లు చూపించి పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. నగరంలోని పలు పరీక్ష కేంద్రాలను కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ తనిఖీ చేశారు. కంటోన్మెంట్లోని సెయింట్ ఆన్స్ బాలికోన్నత పాఠశాల, మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. అనారోగ్యంతో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అవసరమైన మందులు అందజేయాలని సిబ్బందిని ఆదేశించారు. విజయనగరం మండలంలోని జొన్నవలస ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. ఆయన వెంట డీఈఓ యు.మాణిక్యంనాయుడు, విజయనగరం తహసీల్దార్ కూర్మనాథరావు ఉన్నారు.
తొలిరోజు 99.52 శాతం హాజరు
జిల్లాలో 119 పరీక్ష కేంద్రాల్లో తొలిరోజు జరిగిన తెలుగు పరీక్షకు 22,908 మందికి 108 మంది గైర్హాజరైనట్టు డీఈఓ యూ.మాణిక్యంనాయుడు తెలిపారు. 99.52 శాతం మంది హాజరయ్యారన్నారు.

తొలిరోజు పరీక్ష ప్రశాంతం

తొలిరోజు పరీక్ష ప్రశాంతం