గోపాలపట్నం: జిల్లాలోని స్కూల్ బస్సులు తప్పనిసరిగా భద్రతా ప్రమాణాలు పాటించాలని ఇన్చార్జి డీటీసీ మణికుమార్ ఆదేశించారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బస్సుల యజమానులకు, డ్రైవర్లకు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఎంవీఐలు, ఏఎంవీఐలు కలిసి ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల మేరకు ఈ తనిఖీలు నిర్వహించారు. నగరంలో గత నెల 28 నుంచి చేపట్టిన ఈ తనిఖీల్లో భాగంగా.. మొత్తం 1,250 బస్సులకు గానూ ఇప్పటివరకు 368 బస్సులను తనిఖీ చేసినట్లు డీటీసీ తెలిపారు. వీటిలో 76 బస్సులు భద్రతా ప్రమాణాలను పాటించడం లేదని గుర్తించినట్లు పేర్కొన్నారు. నిబంధనలు ఉల్లంఘించిన బస్సుల యజమానులకు ఇప్పటికే నోటీసులు జారీ చేశామని, వారం రోజుల్లోగా లోపాలను సరిచేసుకోవాలని సూచించారు. లేని పక్షంలో ఆ వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
నిబంధనలు పాటించని
76 బస్సులకు నోటీసులు


