 
															నేడు ఈఎన్సీ చీఫ్ పదవీ విరమణ
సాక్షి, విశాఖపట్నం : ఈస్ట్రన్ నేవల్ కమాండ్ వైస్ అడ్మిరల్ రాజేష్ పెందార్కర్ నేడు పదవీ విరమణ చేయనున్నారు. 2023 ఆగస్ట్ 1న తూర్పు నౌకాదళాధిపతిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. 1987లో భారత నౌకాదళంలో ప్రవేశించిన ఆయన యాంటీ సబ్మైరెన్ వార్ఫేర్ స్పెషలిస్ట్గా తక్కువ కాలంలోనే పేరు సంపాదించారు. పలు యుద్ధ నౌకల కెప్టెన్గా విధులు నిర్వర్తించి.. మహారాష్ట్ర నేవల్ ఏరియా ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్గా పదోన్నతి పొందారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడెమీ ఇన్స్ట్రక్టర్గా వ్యవహరించారు. కమాండర్ హోదాలో స్టాఫ్ రిక్రూట్మెంట్ డైరెక్టర్గానూ, నెట్సెంట్రిక్ ఆపరేషన్స్లో ప్రిన్సిపల్ కమాండర్గా, నేవల్ డైరెక్టరేట్(పర్సనల్)లో ప్రిన్సిపల్ డైరెక్టర్గా విధులు నిర్వర్తించారు. 2016లో రియర్ అడ్మిరల్ హోదాలో డిఫెన్స్ ఇంటిలిజెన్స్ ఏజెన్సీలో అసిస్టెంట్ చీఫ్గా బాధ్యతలు చేపట్టారు. పశ్చిమ నౌకాదళం చీఫ్ స్టాఫ్ ఆఫీసర్గా, ఫ్లాగ్ ఆఫీసర్గా, ఇండియన్ కోస్ట్గార్డ్, నేవీలో సీ ట్రైనింగ్ అధికారిగా విధులు నిర్వర్తించారు. ఈఎన్సీ చీఫ్గా రాకముందు.. నేవల్ హెడ్క్వార్టర్స్లో డైరెక్టర్ జనరల్ నేవల్ ఆపరేషన్స్(డీజీఎన్వో)గా బాధ్యతలు చేపట్టారు. మిలాన్–2024తో పాటు మలబార్, టైగర్ ట్రయాంఫ్.. ఇలా ఎన్నో కీలక నౌకాదళ విన్యాసాలు వైస్ అడ్మిరల్ పెంధార్కర్ సారథ్యంలో విశాఖలో విజయవంతంగా నిర్వహించారు. పెంధార్కర్కు వీడ్కోలు కార్యక్రమం శుక్రవారం నిర్వహించేందుకు తూర్పు నౌకాదళంలో ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
