
ఉచిత సీట్ల కేటాయింపులో ‘ప్రైవేటు’ నిర్లక్ష్యం
శ్రీ ప్రకాష్ స్కూల్ ఎదుట తల్లిదండ్రుల నిరసన
కొమ్మాది: జీవీఎంసీ 4వ వార్డు కాపులుప్పాడ ప్రాంతంలోని శ్రీ ప్రకాష్ పాఠశాలలో ఉచిత సీట్ల కేటాయింపులో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని ఆరోపిస్తూ.. మంగళవారం ఆ స్కూల్ ఎదుట తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం కేటాయించిన ఉచిత సీట్లను మంజూరు చేయడంలో జాప్యం చేస్తోందని ఆరోపించారు. వివరాల్లోకి వెళ్తే.. మొదటి విడతలో 8 మంది, రెండవ విడతలో 5 గురు విద్యార్థులకు శ్రీప్రకాష్ పాఠశాలలో ఉచిత ప్రవేశాలకు ప్రభుత్వం సీట్లు కేటాయించింది. మే 29న తమ పిల్లలకు సీట్లు వచ్చిన వెంటనే తల్లిదండ్రులు పాఠశాల యాజమాన్యాన్ని సంప్రదించారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు వారికి సీట్లు కేటాయించకపోవడంతో దాదాపు నెల రోజులుగా పాఠశాల చుట్టూ తిరుగుతున్నామని తల్లిదండ్రులు వాపోయారు. ఈ విషయంపై డీఈవో, ఎంఈవో కార్యాలయాలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాము ఆందోళనకు దిగినట్లు తెలిపారు. తమకు న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికే అన్ని పాఠశాలల్లో తరగతులు ప్రారంభమై, అడ్మిషన్లు పూర్తయిన తరుణంలో ఉచిత సీట్లు లేవని చేతులెత్తేస్తే తమ పిల్లల భవిష్యత్తు ఏమిటని ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై పాఠశాల యాజమాన్యాన్ని వివరణ కోరగా.. వారు ఎటువంటి సమాధానం ఇవ్వలేదు. ఆందోళన సమాచారం అందుకున్న డిప్యూటీ డీఈవో సోమేశ్వరరావు, ఎంఈవో శివరాణి పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులకు ఉచిత సీట్లు అందిస్తామని తల్లిదండ్రులకు హామీ ఇచ్చారు. దీంతో వారు ఆందోళన విరమించారు.