
వేట సాఫీగా సాగాలని.. గంగమ్మకు పూజలు
మహారాణిపేట: ‘గంగమ్మ తల్లీ కాపాడు’అంటూ మత్స్యకార మహిళలు సముద్రుడికి భక్తితో ప్రణమిల్లారు. చేపల వేటలో తమ వారికి విస్తారంగా మత్స్య సంపద దొరకాలని, వేటకు వెళ్లిన వారు క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటూ మంగళవారం ఫిషింగ్ హార్బర్లో గంగమ్మ మారువారం పండగను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. శ్రీ గంగా భవానీ చేపల వేట సంఘం ఆధ్వర్యంలో ఈ వేడుక కనులపండువగా సాగింది. ఇందులో భాగంగా హార్బర్లోని గంగమ్మ తల్లి ఆలయంలో మహిళలు పెద్ద సంఖ్యలో పసుపు, కుంకుమలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం డ్రై ఫిష్ మహిళా సంఘం సభ్యులు, ఇతర మహిళలు కలశాలతో ఊరేగింపుగా బయలుదేరి సముద్రుడికి పసుపు, కుంకుమలను సమర్పించి మొక్కులు చెల్లించారు. మరపడవల సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు పి.సి.అప్పారావు, అధ్యక్షుడు ఎం.లక్ష్మణరావు, నాయకులు మున్నం బాలాజీ, ఎం.సోములమ్మ, డి.ఎర్రమ్మ తదితరులు పాల్గొన్నారు.